Crime News: బధిరురాలిపై నెల రోజులపాటు అఘాయిత్యం

ఓ బధిర మహిళను బంధించి అత్యాచారం చేశారనే ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పోలీసులు తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో విచారణ జరుపుతున్నారు. సాంకేతిక ఆధారాలతో ఆదివారం పలుచోట్ల కూపీ లాగినట్లు సమాచారం

Published : 21 Mar 2022 08:27 IST

బందరులో కిడ్నాప్‌.. కరీంనగర్‌లో నిర్బంధం
రహస్యంగా మచిలీపట్నం పోలీసుల విచారణ

మచిలీపట్నం క్రైం, కరీంనగర్‌, న్యూస్‌టుడే: ఓ బధిర మహిళను బంధించి అత్యాచారం చేశారనే ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పోలీసులు తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో విచారణ జరుపుతున్నారు. సాంకేతిక ఆధారాలతో ఆదివారం పలుచోట్ల కూపీ లాగినట్లు సమాచారం. మచిలీపట్నానికి చెందిన వంట కార్మికురాలు (37) ఫిబ్రవరి 4న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆ మూగ మహిళ కుటుంబీకులు మరునాడు స్థానిక ఇనుగుదురుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. మార్చి 9న బాధితురాలి కుటుంబీకులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి, తాను కరీంనగర్‌ నుంచి మాట్లాడుతున్నానని, ఓ మహిళ ఇక్కడ ఉందని తెలిపాడు. ఆ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు కరీంనగర్‌కు వచ్చి బాధితురాలిని తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మాటలు రాకపోవడంతో ఏం జరిగిందన్నది ఆమె చెప్పలేకపోయింది.

రెండోసారి ఫిర్యాదుతో విచారణ
బాధిత మహిళ ఇంటికి చేరిన రెండు మూడు రోజుల తర్వాత సైగల ద్వారా తనను కిడ్నాప్‌ చేసి ఓ గదిలో కొన్నాళ్లు బంధించి అత్యాచారం చేశారని సోదరుడికి చెప్పడంతో అతను మళ్లీ బందరులోని ఆర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశాలతో సీఐ కొండయ్య నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితురాలిని వెంటబెట్టుకొని తాజాగా కరీంనగర్‌కు వచ్చింది. ఆమెను ఏ ప్రాంతంలో ఉంచారు? ఏం జరిగిందన్నది స్థానిక పోలీసుల సహకారంతో గోప్యంగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాధితురాలి సోదరుడికి గతంలో ఫోన్‌ చేసిన నంబర్‌ కీలకంగా మారింది. ఇంత దూరం ఎవరు తీసుకువచ్చారు? ఎవరి చెరలో ఉంచారు? అన్నది కూపీ లాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని