Crime News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపువద్ద శనివారం రాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. రాత్రి ఒంటి గంట వరకు ...

Updated : 27 Mar 2022 10:00 IST

భాకరాపేట ఘాట్‌లో లోయలోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు

ఎనిమిది మంది దుర్మరణం

54 మందికి గాయాలు

శనివారం రాత్రి దుర్ఘటన

అనంతపురం జిల్లా నుంచి తిరుచానూరుకు నిశ్చితార్థానికి వస్తుండగా ప్రమాదం

ఈనాడు - తిరుపతి, న్యూస్‌టుడే - చంద్రగిరి గ్రామీణ: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపువద్ద శనివారం రాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. రాత్రి ఒంటి గంట వరకు అందిన సమాచారం మేరకు.. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. 54 మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది. చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అందరూ భోజనాలు చేశారు. ఆపై 9 కిలోమీటర్లు ప్రయాణించి భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవరు అతి వేగంగా నడపటంతో మలుపువద్ద అదుపు తప్పి కుడివైపున 60 అడుగుల లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోదించారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం.. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్షతగాత్రుల రోదనలు, మృత దేహాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల్లో 8 మంది పిల్లలు సహా వృద్ధులున్నారు.

గాఢాంధకారం.. సహాయచర్యలకు ఆటంకం 

చిమ్మచీకటిగా ఉండటం, ఘాట్‌ రోడ్డు కావడంతో ప్రమాదం జరిగిన విషయం రాత్రి 10.30 గంటల వరకు వెలుగు చూడలేదు. క్షతగాత్రుల హాహాకారాలతో అటుగా వెళ్లే వాహనచోదకులు ఆగి లోయలోకి దిగి చూశారు. అక్కడ బస్సు పడి ఉండటం, క్షతగాత్రులు చెల్లాచెదురై రోదిస్తుండటాన్ని గమనించి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ మార్గంలో వెళ్లే వాహనచోదకులు, పోలీసులు అప్రమత్తమై.. లోయలో పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. రాత్రి ఒంటి గంట వరకు క్షతగాత్రులను వెలికితీసి, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఘటనాస్థలానికి చేరుకొని, సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

మృతులు..

మలిశెట్టి వెంగప్ప(60), మలిశెట్టి మురళి(45), కాంతమ్మ(40), మలిశెట్టి గణేశ్‌(40), డైవర్‌ నబీ రసూర్‌, క్లీనర్‌(ఘటనా స్థలిలో). తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ ఆదినారాయణ రెడ్డి, నారావారిపల్లెలోని ఆస్పత్రిలో యశస్విని(8) మృతి చెందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని