తెదేపా నేత అపహరణ

చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమంద పంచాయతీ పచ్చార్లమాకులపల్లెకు చెందిన తెదేపా నేత ఎ.రాజారెడ్డిని శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.

Published : 02 Apr 2022 05:32 IST

గంట తర్వాత తీవ్ర గాయాలతో ప్రత్యక్షం
కళ్లకు గంతలు కట్టి బండరాళ్లతో కొట్టారని బాధితుడి ఆవేదన

కల్లూరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమంద పంచాయతీ పచ్చార్లమాకులపల్లెకు చెందిన తెదేపా నేత ఎ.రాజారెడ్డిని శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. కల్లూరు నుంచి పీలేరుకు వెళ్లే దారిలో పెట్రోలు బంకు సమీపంలోని టమాటా మండీ వద్ద రాజారెడ్డి ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. గంట తర్వాత కల్లూరు నుంచి గంటావారిపల్లెకు వెళ్లే మార్గంలోని ఎలకమాను వద్ద తీవ్ర గాయాలతో రాజారెడ్డి పడి ఉన్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందడంతో హుటాహుటిన కల్లూరు ఎస్సై శ్రీనివాసులు సిబ్బందితో వెళ్లారు. అప్పటికే రాజారెడ్డి రెండు కాళ్లకు తీవ్ర గాయాలై పడి ఉండడాన్ని గమనించి 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడు రాజారెడ్డి మాట్లాడుతూ.. కల్లూరులో తనను గుర్తుతెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారన్నారు. కళ్లకు గంతలు కట్టి గంటావారిపల్లె సమీపంలోని ఓ పొలంలోకి తీసుకెళ్లి బండరాళ్లతో రెండు కాళ్లపై కొట్టినట్లు చెప్పారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాకాల సీఐ ఆశీర్వాదం, కల్లూరు ఎస్సై శ్రీనివాసులు రాజారెడ్డిని విచారించారు. రాజారెడ్డిని పుంగనూరు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని