తాటిముంజలు కొంటుండగా ఢీకొన్న కారు.. తండ్రి, ఇద్దరు చిన్నారుల దుర్మరణం

రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటుండగా.. కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఇద్దరు పిల్లలతో పాటు తండ్రిని కబళించింది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం గౌరీపురం వద్ద విశాఖ-అరకు

Updated : 11 Apr 2022 06:56 IST

తల్లి, మరో బాలిక పరిస్థితి విషమం

శృంగవరపుకోట, అనంతగిరి, న్యూస్‌టుడే: రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటుండగా.. కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఇద్దరు పిల్లలతో పాటు తండ్రిని కబళించింది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం గౌరీపురం వద్ద విశాఖ-అరకు రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారుల తల్లి, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడకు చెందిన ఓ కుటుంబం అరకు నుంచి కారులో తిరిగి వస్తుండగా అదుపు తప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కిల్లో సోనాపతి ఎస్‌.కోటలో ఉంటున్నారు. ఆదివారం భార్యాపిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై శివలింగపురం వెళ్తూ మార్గమధ్యలో తాటిముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆగారు. అప్పుడే వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆయన పిల్లలు శ్రావణ్‌(7), సుహాస్‌(4) ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సోనాపతి(38)ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఆయన భార్య శ్రావణి తీవ్రగాయాలతో విశాఖలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ద్విచక్రవాహనంపై ఉన్న ఎస్‌.కోట మండలం పెదఖండేపల్లికి చెందిన కొసరు అప్పారావు, ఆయన తమ్ముడి కుమార్తె సుహిత(5) తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి కోమాలోకి వెళ్లింది. వీరిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. ప్రమాదంపై ఎస్‌.కోట ఎస్‌ఐ లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోనాపతి, ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కోనాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని