Andhra News: ఓ ప్రముఖుడి నివాసంలో.. ఏసీ మెకానిక్‌ అనుమానాస్పద మృతి

గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్‌ పరిధిలోని ఐజేఎం విల్లాస్‌లో ఏసీ మరమ్మతుల కోసం వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఆదివారం ఆలస్యంగా

Updated : 18 Apr 2022 09:16 IST

ఘటన తర్వాత ఇంట్లోని వ్యక్తులు అదృశ్యం

రెండు రోజులుగా మార్చురీలోనే శవం

మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్‌ పరిధిలోని ఐజేఎం విల్లాస్‌లో ఏసీ మరమ్మతుల కోసం వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విల్లా ప్రభుత్వంలోని ఓ కీలక ప్రజాప్రతినిధిదిగా ప్రచారం జరుగుతోంది. ఆ భవంతిలో ఆయన మనుషులు మాత్రమే ఉంటుండగా, ఈ ఘటన తర్వాత వారు కూడా వెళ్లిపోవడంతో అసలేం జరిగిందన్నది అంచనాకు రాలేకపోతున్నారు. మంగళగిరి టిప్పర్లబజార్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌(20) తోటి మెకానిక్‌ షఫుల్లాతో కలిసి మేస్త్రి షేక్‌ యూసఫ్‌ ఆలీ ఆదేశాలతో శనివారం ఆ విల్లాలో మరమ్మతుల పనికి వెళ్లాడు. పనిచేసిన తర్వాత ఫోన్‌ మాట్లాడుతూ విల్లా పైభాగంలోకి వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాలేదు. తోటి మెకానిక్‌, ఇతరులు పైకి వెళ్లి చూడగా ఆ యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన శనివారం జరిగితే ఆదివారం వరకు ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? రెండు రోజులైనా పోస్టుమార్టం ఎందుకు చేయలేదు? ఆ విల్లాలోని వ్యక్తులు ఎందుకు మాయమయ్యారు? అన్నది పోలీసులు చెప్పడం లేదు.

మృతుడి కుటుంబీకులతో రాజీ చర్చలు నడుస్తున్నాయని, అందుకే పోస్టుమార్టం ఆలస్యమైందని తెలుస్తోంది. మృతుడు షేక్‌ మహమ్మద్‌కు తండ్రి లేరు. తల్లి, అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. మనవడి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అమ్మమ్మ షేక్‌ కమురున్నీసా మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. భవంతి పైభాగానికి ఫోన్‌ మాట్లాడుకోవడానికి వెళ్లిన తన మనువడు స్పృహ తప్పి పడిపోయారని తొలుత చెప్పిన వ్యక్తులు.. రెండు నిమిషాలకే మళ్లీ ఫోన్‌ చేసి.. మహమ్మద్‌ చనిపోయాడని చెప్పారు. చేతిపై, కాలిపై గాయాలున్నాయి. ఈ మరణంపై మాకు అనుమానాలున్నాయి’ అని ఆమె చెబుతున్నారు. నార్త్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ ‘విల్లా పైభాగంలోకి స్పృహ తప్పి పడిపోయిన మహమ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బహుశా విద్యుత్‌ షాక్‌ లేదా షార్టుసర్క్యూట్‌ వల్ల మృతిచెంది ఉండొచ్చు. ఏసీ అవుట్‌డోర్‌ మిషన్‌పై భాగంలోనే ఉంది. ఫోన్‌ మాట్లాడుతూ మిషన్‌కు తగలడం వల్ల లేక విద్యుత్తు సరఫరా అవుతున్న వైరును తాకడం వల్ల కరెంటు షాక్‌ తగిలి చనిపోయి ఉండొచ్చు. యువకుడి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామ’ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని