Andhra News: మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం

 నిత్యం జనంతో రద్దీగా ఉండే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. మానసిక వికలాంగురాలైన ఓ యువతి (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Published : 22 Apr 2022 05:54 IST

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో హేయమైన ఘటన
ఇరుకుగదిలో బంధించి 30 గంటలకు పైగా పాశవిక దాడి

ఈనాడు- అమరావతి:  నిత్యం జనంతో రద్దీగా ఉండే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. మానసిక వికలాంగురాలైన ఓ యువతి (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 30 గంటలపాటు ఆమె పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఓ ఇరుకు గదిలో బంధించి దాడికి పాల్పడ్డారు. అప్పటి వరకూ ఇంటి వద్ద ఉన్న తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లగా.. స్పందించకుండా సాయంత్రం రావాలంటూ తిప్పి పంపించేశారు.  ఫలానా నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని ఆధారమిచ్చినా సరే వెంటనే చర్యలు చేపట్టలేదు. ఆలస్యంగా స్పందించి బాధితురాలు ఎక్కడుందో తెలుసుకున్నా.. ఆమెను రక్షించటానికి వెళ్లలేదు. బాధితురాలి కుటుంబసభ్యులే అక్కడికి వెళ్లి బిడ్డను కాపాడుకోవాల్సి రావడం, అప్పటికీ బాధిత యువతిపై లైంగిక దాడి జరుగుతుండటం పోలీసుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. పోలీసులు సత్వరం స్పందించి ఉంటే ఈ స్థాయి ఘోరం కొనసాగి ఉండేది కాదు.

విజయవాడ వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఈ నెల 19వ తేదీ రాత్రి ఆమె ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా.. అదే ప్రాంతానికి చెందిన దారా శ్రీకాంత్‌ (26) అనే యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని పెస్ట్‌ కంట్రోల్‌ విభాగంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే శ్రీకాంత్‌ విధులకెళ్లే సమయంలో తనతో పాటు ఆ యువతిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఓ ఇరుకు గదిలో ఆమెను ఆ రాత్రంతా బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు 20వ తేదీ ఉదయం ఆసుపత్రిలోనే ఆమెను వదిలేసి తాను ఇంటికెళ్లిపోయాడు.  ఆసుపత్రి ప్రాంగణంలోనే అయోమయంగా తిరుగుతున్న ఆ యువతిపై ఆసుపత్రిలో పనిచేసే ఒప్పంద కార్మికుడు చెన్న బాబురావు (23), అతని స్నేహితుడు జోరంగుల పవన్‌కల్యాణ్‌ (23) కన్ను పడింది. వారిద్దరూ ఆమెను మరోమారు ఇరుకుగదిలో నిర్బంధించి అత్యాచారానికి తెగబడ్డారు.

19వ తేదీ రాత్రి 8 గంటల నుంచి కుమార్తె కనిపించకపోవటంతో బాధితురాలి తల్లిదండ్రులు గాలించారు. ఫలితం లేకపోవటంతో 20వ తేదీ ఉదయం 11 గంటలకు నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె అదృశ్యమవటానికి కొంత సమయం ముందు ఒక సెల్‌ నంబరు నుంచి ఫోన్‌ వచ్చిందంటూ పోలీసులకు చెప్పారు. దాని ఆధారంగానైనా తమ కుమార్తె ఎక్కడుందో కనుక్కోవాలని ప్రాథేయపడ్డారు.  సాయంత్రం వచ్చి కలవాలని   పోలీసులు వారిని పంపించేశారు. సాయంత్రం మరోమారు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. వారు అంతకు ముందు ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ నిందితుడు దారా శ్రీకాంత్‌ది అని గుర్తించి అతణ్ని  తీసుకొచ్చి విచారించారు. బాధిత యువతిని తనతోపాటు ఆసుపత్రికి తీసుకెళ్లానని, అక్కడే వదిలేశానని అతను పోలీసులకు చెప్పాడు.

నిందితుడు శ్రీకాంత్‌ విచారణలో చెప్పిన సమాచారం ఆధారంగా బాధిత యువతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు 20వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ తమ కుమార్తె కోసం గాలిస్తుండగా... జోరంగుల పవన్‌కల్యాణ్‌ అనే యువకుడు ఆ యువతిపైన లైంగిక దాడికి పాల్పడుతూ కనిపించాడు. కన్నబిడ్డపై తమ కళ్ల ముందే జరుగుతున్న ఆ ఘోరాన్ని చూసి తట్టుకోలేక బాధిత కుటుంబసభ్యులు.. కన్నీరుమున్నీరయ్యారు. పవన్‌ను తీసుకొచ్చి నున్న పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని విచారించగా తన కంటే ముందు చెన్న బాబురావు కూడా బాధిత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పటంతో ఈ అమానుష చర్య మొత్తం బయటపడింది. అత్యాచారానికి పాల్పడిన  దారా శ్రీకాంత్‌,  చెన్నా బాబూరావు,  జోరంగుల పవన్‌కల్యాణ్‌లను అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని