Crime News: వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం.. ఎస్సీ బాలికపై 10 మంది అఘాయిత్యం

ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది.

Published : 12 May 2022 09:21 IST

గర్భం దాల్చిన బాధితురాలు

ఈనాడు డిజిటల్‌, కడప: ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి.
ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద ఓ మైనరు బాలిక ఆశ్రయం పొందుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంటారు. ఆమె తల్లి చాలా ఏళ్ల కిందట చనిపోయారు. ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ డెకరేషన్‌ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. చెంబు,  అతని స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న మహిళా కానిస్టేబుల్‌ మల్లీశ్వరి బాధితురాలితో మాట్లాడి అన్ని వివరాలను సేకరించారు. తనపై చెంబు, అతని స్నేహితులు అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు వివరించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా... ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని వారు సమాధానమిచ్చారని పేర్కొంది. ఆ బాలిక చెప్పిన సమాచారం మొత్తాన్ని కానిస్టేబుల్‌ మల్లీశ్వరి వీడియో తీశారు. అనంతరం పట్టణంలోని ఓ సీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సీఐ ఈ విషయం బయటకు పొక్కకుండా బాధితురాలిని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే అమృతనగర్‌లోని ఓ ఆశ్రమానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రూరల్‌ పోలీసులూ కేసు నమోదు చేయకుండా... ఆ బాలికను ఈ నెల 8న మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఆశ్రయం పొందుతోంది.


విచారణ చేపట్టాం

బాలికపై అత్యాచార ఘటన మా దృష్టికి వచ్చింది. విచారణకు ఆదేశించాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించం. త్వరలోనే కొలిక్కి వస్తుంది.

- ప్రసాదరావు, డీఎస్పీ, ప్రొద్దుటూరు, వైయస్‌ఆర్‌ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని