Road Accident: నడిరోడ్డుపై ముగ్గురి సజీవ దహనం

ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. కారు టైరు పంక్చరై కంటెయినర్‌ను ఢీకొనగా, పెట్రోల్‌ ట్యాంకు పేలి

Published : 18 May 2022 08:25 IST

టైరు పంక్చరై.. లారీని ఢీకొన్న కారు

మంటలు రేగి బుగ్గయిన మృతదేహాలు

మార్కాపురం గ్రామీణం, భాకరాపేట - న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. కారు టైరు పంక్చరై కంటెయినర్‌ను ఢీకొనగా, పెట్రోల్‌ ట్యాంకు పేలి ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. క్షణాల్లో మంటలు చుట్టుముట్టడంతో కారులోని వారంతా కాలి బుగ్గయ్యారు. జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్థానికులు భీతిల్లారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన ఇమ్రాన్‌ (21), బాలాజీ (21), తేజ (29) కారులో కంభం నుంచి మార్కాపురంవైపు వెళ్తున్నారు. అదే సమయంలో చేపల లోడుతో ఉన్న కంటెయినర్‌ మార్కాపురం నుంచి కంభానికి వస్తోంది. తిప్పాయిపాలెం దాటిన తర్వాత కారు టైర్‌ పంక్చరై అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొంది. కంటెయినర్‌ దాదాపు 40మీటర్ల వరకూ ఈడ్చుకుపోవడంతో కారు పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి మంటలు వ్యాపించాయి. దీంతో అందులోని వారు ప్రాణాలు కోల్పోయారు. కంభం అగ్నిమాపకశాఖ అధికారి ప్రసాదరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమై అందులోకి వ్యక్తుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. వాహనాలు రెండూ వేగంగా వెళ్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సీఐ ఆంజనేయరెడ్డి వివరించారు. కారులో ప్రయాణిస్తున్నది ముగ్గురా నలుగురా అన్నది తేలాల్సి ఉందన్నారు. వాహన యజమాని చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం అదినవారిపల్లికి చెందిన ఈటిమరుపు నరేంద్రగా గుర్తించామని, ఆయన వాహనంలో లేరని స్పష్టం చేశారు.

తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన ఇమ్రాన్‌, బాలాజీ, తేజ ప్రాణమిత్రులు. ఇమ్రాన్‌ గుంటూరులోని టెలికాంశాఖకు బొలేరో వాహనాన్ని అద్దెకు ఇచ్చి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తేజకు వివాహమైంది. అతడికి భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. అప్పుడప్పుడు షాల్ట్‌ ఫిల్మ్‌లు తీస్తుంటాడని స్థానికులు తెలిపారు. బాలాజీ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఈ నెలాఖరులో తేజ కువైట్‌ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉన్నందున ముగ్గురూ కలిసి విజయవాడ వెళ్లగా, తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం వారిని కబళించింది. ముగ్గురి మృతి వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు