Telangana News: రూ.లక్షలిస్తావా.. జైలుకెళ్తావా?

అవినీతి నిరోధక శాఖ (అనిశా-ఏసీబీ) డీఎస్పీ పేరుతో జగిత్యాల జిల్లాలోని పలువురు తహసీల్దార్లకు ఓ అగంతుకుడి నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తూ బెదిరింపు ఫోన్లు వచ్చాయి. సదరు వ్యక్తి మొదట సంబంధిత మండల ఎస్‌.ఐ.లకు ఫోన్‌ చేసి వారి ద్వారా తహసీల్దార్‌ మొబైల్‌ నంబర్‌ సంపాదించాడు. మొదట ఎస్‌.ఐ.లతో తహసీల్దార్లకు ఫోన్‌ చేయించి తర్వాత తాను మాట్లాడటంతో నిజమని నమ్మిన తహసీల్దార్లు వణికిపోయారు. కొందరు భయంతో విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.. మరికొందరేమో సన్నిహితులతో పంచుకున్నారు. వివరాలు..

Published : 19 May 2022 06:06 IST

 అనిశా డీఎస్పీ పేరుతో తహసీల్దార్లకు ఫోన్లు

డబ్బు కోసం బెదిరింపులు.. ఎస్‌.ఐ.లతో ఎర

జగిత్యాల జిల్లాలో కలకలం

జగిత్యాల, న్యూస్‌టుడే: అవినీతి నిరోధక శాఖ (అనిశా-ఏసీబీ) డీఎస్పీ పేరుతో జగిత్యాల జిల్లాలోని పలువురు తహసీల్దార్లకు ఓ అగంతుకుడి నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తూ బెదిరింపు ఫోన్లు వచ్చాయి. సదరు వ్యక్తి మొదట సంబంధిత మండల ఎస్‌.ఐ.లకు ఫోన్‌ చేసి వారి ద్వారా తహసీల్దార్‌ మొబైల్‌ నంబర్‌ సంపాదించాడు. మొదట ఎస్‌.ఐ.లతో తహసీల్దార్లకు ఫోన్‌ చేయించి తర్వాత తాను మాట్లాడటంతో నిజమని నమ్మిన తహసీల్దార్లు వణికిపోయారు. కొందరు భయంతో విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.. మరికొందరేమో సన్నిహితులతో పంచుకున్నారు. వివరాలు..

బుధవారం ఉదయం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఓ మహిళా ఎస్‌.ఐ. మండల తహసీల్దారుకు ఫోన్‌ చేశారు. ఏసీబీ డీఎస్పీ మీ నంబర్‌ అడిగారు, ఆయన మీతో మాట్లాడవచ్చంటూ సమాచారమిచ్చారు. ఆ వెంటనే అగంతుకుడి నుంచి తహసీల్దారుకు ఫోన్‌ వచ్చింది. నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్నా.. నీ మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి.. అంటూ బెదిరించాడు.. ట్రూ కాలర్‌లో మీరు చెప్పేదానికి బదులు మరోపేరు వచ్చిందేంటని తహసీల్దార్‌ అడగగా ఎక్కువ మాట్లాతున్నావంటూ గద్దించి ఫోన్‌ పెట్టేశాడు. అనంతరం అదే పంథాలో నియోజకవర్గంలోని మరో తహసీల్దారుతో మాట్లాడుతూ.. నీమీద అనేక ఫిర్యాదులు వచ్చాయి.  ఏమైనా మాట్లాడతావా.. జైలుకెళతావా అంటూ బెదిరించాడు. అంతేగాక జిల్లాలోని మరో ముగ్గురు తహసీల్దార్ల నంబర్లు అడిగాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చొప్పదండి నియోజకవర్గంలోని ఓ మహిళా తహసీల్దారుతో ఫోనులో మాట్లాడుతూ.. ‘నీ మీద అనేక ఫిర్యాదులున్నాయి. అరెస్టు చేస్తే 45 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఉద్యోగం ఊడుతుంద’ని బెదిరించాడు. గంటలోగా రూ.10 లక్షలు ఇవ్వాలి, లేకుంటే జైలుకు వెళ్లకతప్పదని హెచ్చరించాడు. భర్తతో మాట్లాడి చెబుతానని తహసీల్దార్‌ చెప్పగా.. తానే మాట్లాడతానంటూ నంబర్‌ తీసుకున్న అగంతుకుడు కరీంనగర్‌లో ఉన్న ఆమె భర్తకు ఫోన్‌ చేశాడు. వెంటనే రూ.10 లక్షలు ఇవ్వకుంటే నీ భార్యను కస్టడీకి తీసుకుంటానంటూ భయపెట్టాడు. తన వద్ద డబ్బు లేదని, తప్పదంటే భార్య బంగారం అమ్మి ఇస్తానని, కొంత సమయం కావాలని కోరగా.. సరేనన్నాడు. ఒకే పంథాలో ఓ అనామకుడు ఎస్‌.ఐ.లను,  తహసీల్దార్లనూ డబ్బు కోసం ఇలా బెదిరించటం, వారతన్ని అనుమానించకుండా చెప్పినట్లు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయాన్ని ‘న్యూస్‌టుడే’ జగిత్యాల డీఎస్పీ ఆర్‌.ప్రకాష్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. అగంతుకుడు బెంగళూరు నుంచి మాట్లాడినట్లు గుర్తించారు. నిందితుణ్ని పట్టుకుంటామని అధికారులెవరూ భయాందోళనలకు లోనుకావద్దని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని