ఆ ఇంట వారంలో పెళ్లి.. అంతలోనే విషాదం

ఆ ఇంట మరో వారం రోజుల్లో పెళ్లి.. అంతా సందడిగా ఉంది.. బంధువులతో కలిసి శుభకార్యానికి సామగ్రి కొనడానికి ఉత్సాహంగా వెళ్తుండగా అకస్మాత్తుగా చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం

Updated : 19 May 2022 04:58 IST

ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురి దుర్మరణం

ఖానాపురం, న్యూస్‌టుడే: ఆ ఇంట మరో వారం రోజుల్లో పెళ్లి.. అంతా సందడిగా ఉంది.. బంధువులతో కలిసి శుభకార్యానికి సామగ్రి కొనడానికి ఉత్సాహంగా వెళ్తుండగా అకస్మాత్తుగా చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ గ్రామ శివారు దూసముద్రం చెరువు కట్టపై ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. ఖానాపురం మండలం చిలుకమ్మతండా పంచాయతీ పరిధి పర్శతండాకు చెందిన గుగులోత్‌ ధన్‌సింగ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఈ నెల 24న చిన్న కుమార్తె పెళ్లి పెట్టుకున్నారు. వివాహానికి సామగ్రి కొనుగోలు చేసేందుకు బంధువులతో కలిసి మొత్తం 10 మంది బుధవారం ట్రాక్టర్‌లో నర్సంపేట వెళుతున్నారు. ధన్‌సింగ్‌ కుమారుడు అశోక్‌ ట్రాక్టర్‌ నడుపుతున్నారు. ఈ క్రమంలో బయలుదేరిన 15 నిమిషాల్లోనే అశోక్‌నగర్‌ గ్రామ శివారు దూసముద్రం చెరువు కట్టపై ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో ట్రాక్టర్‌ 10-12 అడుగుల కిందకు జారి బోల్తా పడింది. దీంతో గుగులోత్‌ స్వామి(48), జాటోత్‌ బిచ్చమ్మ(60), గుగులోత్‌ సీత(44) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గుగులోత్‌ శాంతమ్మ(42), జాటోత్‌ గోవిందు(65)లను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో మృతిచెందారు.

నవ వధూవరులను ఆశీర్వదించాల్సిన పెద్దలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి కూతురుకు శాంతమ్మ, స్వామి పెద్దమ్మ, పెద్దనాన్న అవుతారు. బిచ్చమ్మ, గోవింద్‌లు అమ్మమ్మ, తాతయ్య.. సీత మేనత్త అవుతుంది. ట్రాక్టర్‌లో ఉన్న మరో ఐదుగురు ధన్‌సింగ్‌, విజయ, మమత, వనజ, అశోక్‌ గాయపడగా.. వారంతా చికిత్స పొందుతున్నారు.

చేనులో ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి దుర్మరణం

భీంపూర్‌, న్యూస్‌టుడే: పంటచేనును చదును చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడి రైతు, డ్రైవరు మృతిచెందిన ఘటన బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం గోముత్రి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోముత్రికి చెందిన రైతు పర్దాన్‌ అశోక్‌(35), రాజస్థాన్‌లోని జైపుర్‌కి చెందిన డ్రైవరు లోకేష్‌(25) చనిపోయారు. చేనులో దుక్కి దున్నుతున్న సమయంలో దిగువన ఉన్న గుంతను తప్పించే క్రమంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడగా.. వారిద్దరూ టైర్ల కింద ఇరుక్కుపోయారు. గ్రామస్థులు మరో ట్రాక్టర్‌ సాయంతో అతికష్టం మీద వారిని బయటకు తీశారు. అప్పటికే రైతు చనిపోగా.. కొన ఊపిరితో ఉన్న డ్రైవరును రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ అతడూ మరణించాడు. అశోక్‌ అన్న కూతురు వివాహం ఈ నెల 22న జరగాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని