గుంటూరులో ఘోరం.. మద్యం తాగించి బాలికపై అత్యాచారం: ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల అరెస్ట్‌

పదిహేనేళ్ల బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి గుంటూరులో జరిగిన ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

Updated : 20 May 2022 06:49 IST

ఈనాడు, అమరావతి: పదిహేనేళ్ల బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి గుంటూరులో జరిగిన ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గుంటూరు నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. గుంటూరు శివారుకు చెందిన బాలిక (15) ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రెండు మాసాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన డి.గ్రేస్‌బాబుతో (19) బాలికకు పరిచయం ఏర్పడింది. గ్రేస్‌బాబు తన స్నేహితులైన వెలిచర్ల రిక్కీ (19), దామా మణికంఠ (19)లను ఆ బాలికకు పరిచయం చేశాడు. ఈ యువకులు ముగ్గురూ గుంటూరు నగర శివారులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

బుధవారం వీరు గుంటూరు నగర శివారు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో ఓ హోటల్‌లో గది తీసుకుని మద్యం సేవించారు. ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు రిక్కీ ఆ బాలికకు వీడియోకాల్‌ చేసి గ్రేస్‌బాబు మద్యం తాగి హోటల్‌లో పడిపోయాడని, మీరొస్తేనే అన్నం తింటానంటున్నాడని నమ్మించాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. ఇంట్లో బాలిక తల్లిదండ్రులు లేకపోవటంతో బలవంతంగా బైక్‌ ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ బాలికకు మద్యం తాగించి మత్తులోకి వెళ్లగానే రిక్కీ, మణికంఠలు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలోనే ఈ దారుణం జరిగింది. బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగితే పోలీసులు గురువారం సాయంత్రం కేసు నమోదు చేయటం విమర్శలకు దారితీసింది. ఆ బాలిక స్నేహితుడు గ్రేస్‌బాబుపై కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అతడు నేరానికి పాల్పడలేదని నల్లపాడు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఇద్దరు నిందితులపై 376డీఏ, 366,363 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

* తల్లిదండ్రులు పనులు ముగించుకుని రాత్రికి ఇంటికి వచ్చే సరికి బాలిక ఇంట్లో లేకపోవటంతో పరిసరాల్లో వెతికారు. మరోవైపు అత్యాచారం అనంతరం బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో ఆ యువకులు ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలేశారు. వెంటనే బాధితురాలి తల్లి నల్లపాడు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు బాలికను జీజీహెచ్‌కు తరలించారు. మరో బృందం హోటల్‌కు వెళ్లి సీసీ కెమెరా ఫుటేజీ సేకరించి నిందితులను అదుపులోకి తీసుకుంది. తెదేపా, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆస్పత్రిలో బాలికను పరామర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విపక్షాలు ధ్వజమెత్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని