వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ హత్య?

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఎమ్మెల్సీ కారులోనే అతడి మృతదేహం ఉండటం శుక్రవారం కలకలం రేపింది. తన భర్తను ఎమ్మెల్సీయే చంపారని సుబ్రహ్మణ్యం భార్య ఆరోపించారు. సుబ్రహ్మణ్యాన్ని స్వయంగా అనంతబాబే తన కారులో తీసుకెళ్లడం.. ప్రమాదం జరిగిందని అర్ధరాత్రి...

Updated : 21 May 2022 07:03 IST

ఎమ్మెల్సీయే హత్య చేశారని డ్రైవర్‌ భార్య ఆరోపణ
తన కారులోనే మృతదేహాన్ని తీసుకొచ్చిన అనంతబాబు
రోడ్డు ప్రమాదంలో మరణించారంటున్న ఎమ్మెల్సీ
అక్కడ ప్రమాదమేదీ జరగలేదని సీఐ స్పష్టీకరణ
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
మృతదేహాన్ని తరలించేందుకు ససేమిరా అన్న కుటుంబసభ్యులు
తీవ్ర ఉద్రిక్తతల నడుమ మార్చురీకి తరలింపు

ఈనాడు డిజిటల్‌-రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే-కాకినాడ మసీదు సెంటర్‌, నగరం, బాలాజీచెరువు: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఎమ్మెల్సీ కారులోనే అతడి మృతదేహం ఉండటం శుక్రవారం కలకలం రేపింది. తన భర్తను ఎమ్మెల్సీయే చంపారని సుబ్రహ్మణ్యం భార్య ఆరోపించారు. సుబ్రహ్మణ్యాన్ని స్వయంగా అనంతబాబే తన కారులో తీసుకెళ్లడం.. ప్రమాదం జరిగిందని అర్ధరాత్రి కుటుంబసభ్యులకు చెప్పడం.. కొద్దిసేపటి తర్వాత స్వయంగా తానే కారు వెనుకసీటులో మృతదేహాన్ని పెట్టుకుని తీసుకురావడం.. ఇలాంటి ఘటనలన్నీ అనుమానాలకు కారణమవుతున్నాయి. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అతడి మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించగా.. ఎమ్మెల్సీ వారిని బెదిరించి, కారు అక్కడే వదిలేసి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తన అంతర్గత విషయాలు, రహస్యాలన్నీ తెలుసనే అనంతబాబు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని మృతుడి భార్య ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

కారులో ఎక్కించుకుని...

సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన వీధి సత్తిబాబు, నూకరత్నం. వారు కాకినాడలో ఓ అపార్టుమెంటుకు కాపలాగా ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం (23) ఏడాది క్రితం అపర్ణను ప్రేమవివాహం చేసుకున్నారు. ఆమె ఇప్పుడు నాలుగు నెలల గర్భవతి. సుబ్రహ్మణ్యం ఐదేళ్లు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. ఇటీవల కొంతకాలం క్రితం డ్రైవర్‌ పని మానేసి ఇంటిదగ్గరే ఉంటున్నారు. గురువారం రాత్రి 10.30కి సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి కాకినాడ కొండయ్యపాలెంలో ఉన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యాన్ని పిలవగా.. వచ్చి కారు ఎక్కారు. అర్ధరాత్రి 12.30కు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఫోన్‌ చేసి.. నాగమల్లితోట దగ్గర ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని   ఆసుపత్రికి  తీసుకెళ్తున్నానని, వారినీ అక్కడికి రమ్మని పిలిచారు. మళ్లీ రాత్రి 1.30కు అనంతబాబే తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వెనుక సీటులో వేసుకుని తీసుకొచ్చారు.

బెదిరించి.. వెళ్లిపోయి..

మృతదేహాన్ని తీసుకోవాలని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ సూచించారు. కానీ, మృతదేహం అంతా నీరు కారుతూ, ఇసుకతో ఉండటంతో అసలేం జరిగిందని వారు అడిగారు. ప్రమాదం జరిగిందని, బండి ఢీకొట్టిందని ఎమ్మెల్సీ చెప్పటంతో.. ప్రమాదమైతే తమకు చెప్పాలి గానీ మీరెలా తీసుకొచ్చారని వారు ప్రశ్నించారు. తనతో గొడవ పడొద్దని, శవాన్ని కిందకు దించాలని ఆయన గద్దించారు. శవాన్ని అలాగే ఉంచాలని, కేసు నమోదైన తర్వాతే దింపుతామని కుటుంబసభ్యులు స్పష్టంచేశారు. వెంటనే దింపి జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ చెప్పారు. కారులో శవాన్ని ఉంచి తాళం వేసుకుని వెళ్లిపోతుండగా... కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఆయన మళ్లీ వచ్చి కారు డోర్‌ తీసి.. తాళం తీసుకుని వెళ్లిపోయారు. మృతదేహాన్ని అపార్టుమెంటు వద్దకు తేవడం, అనంతబాబు బెదిరించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని, వాటిని పోలీసులు ఆధారంగా పరిగణించి తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు కోరారు.

అడ్డగింపు.. తోపులాట

శుక్రవారం ఉదయం 8 గంటలకు దళిత నాయకులు అక్కడకు చేరుకుని బాధితులకు న్యాయం చేయాలని, హత్య చేసిన ఎమ్మెల్సీని వెంటనే అరెస్టుచేసి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లకుండా వాహనాలకు అడ్డుపడ్డారు. అక్కడికి వచ్చిన తెదేపా నాయకులు చినరాజప్ప, కొండబాబు, జ్యోతుల నవీన్‌ను పోలీసులు పక్కకు తొలగించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కాకినాడ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసేవరకూ తాము పోస్టుమార్టంకు సమ్మతించబోమని కుటుంబీకులు స్పష్టంచేశారు.


అనంతబాబే చంపేశారు...

- అపర్ణ, మృతుడి భార్య

ది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదం కాదు. ఎమ్మెల్సీ తన పుట్టినరోజని చెప్పి నా భర్తను తీసుకెళ్లారు. ఆయన పుట్టినరోజు నాలుగు నెలల కిందట అయిపోయింది. అనంతబాబు రహస్యాలు, వివాహేతర సంబంధాల గురించి అన్ని విషయాలూ నా భర్తకు తెలుసు. అందుకే చంపేసి శవాన్ని అనంతబాబే కారులో తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎప్పడు నా భర్తను భోజనానికి రమ్మని పిలవలేదు, ఎమ్మెల్సీ మా ఇంటికి కూడా రాలేదు. నేను గర్భిణి అనే కారణంతోనే ఆయన దగ్గర నా భర్త డ్రైవర్‌ పని మానేశారు.


చంపేస్తానని బెదిరించేవారు

- నూకరత్నం, మృతుడి తల్లి

మ్మెల్సీ అనంతబాబు దగ్గర రూ.70 వేల దాకా అప్పు తీసుకున్నాం. ఇప్పటికే రూ.50 వేలు తీర్చేశాం. ఇంకో రూ.20 వేలు ఇవ్వాలి. ఈ నగదు కోసం తరచూ ఫోన్‌ చేసి అడిగేవారు. అప్పయినా తీర్చాలి, లేదా పనిలోకి రావాలని ఒత్తిడి చేసేవారు. లేకపోతే కాళ్లు చేతులు విరిచేసి, చంపేస్తానని చాలాసార్లు ఫోన్‌ చేసి బెదిరించారు. మృతదేహాన్ని తీసుకుని అనంతబాబు ఒక్కరే వచ్చారు. ఇది రోడ్డుప్రమాదం కాదు. ఆయనే నా కొడుకును బీచ్‌కు తీసుకెళ్లి చంపించారని అనుమానంగా ఉంది.


నాగమల్లితోటలో ప్రమాదమేమీ జరగలేదు
- ఆకుల మురళీకృష్ణ, సర్పవరం సీఐ

కాకినాడ అర్బన్‌ నాగమల్లితోట కూడలిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం ఏదీ జరగలేదు. అక్కడ రోడ్డుప్రమాదంలో తన కుమారుడు సుబ్రహ్మణ్యం మరణించినట్లు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ తెలిపారని.. మృతుడి తల్లి నూకరత్నం చెప్పారు. దీనిపై ఏఎస్సై భద్రరావు, సిబ్బందితో తనిఖీ చేయించారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని తేలింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై సతీష్‌బాబు అనుమానాస్పద మృతి కేసుగా నమోదుచేశారు. అనంతరం కేసును పట్టణ రెండో పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశాం.


కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలివీ...

రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. మృతదేహం అంతా నీరు కారుతూ.. సముద్రపు ఇసుకతో ఎలా ఉంటుంది?

మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. పెదవి పగిలింది. వీపు, మెడ, మోకాలు, తదితర భాగాల్లో చీరుకుపోయిన గాయాలు, కవుకు దెబ్బలు, రెండు చేతులు విరిగి వేలాడుతున్నాయి.

ప్రమాదం జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్సీనే ఎలా తీసుకొస్తారు?

పోలీసులకు చెబుతామని చెప్పగానే కారును, మృతదేహాన్ని వదిలి ఎమ్మెల్సీ వెళ్లిపోవడం అనుమానాలకు బలమిస్తోంది.

నిబంధనల మేరకు రోడ్డు ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తీసుకెళ్తారు. క్షతగాత్రులు చికిత్స పొందుతూ చనిపోయినా.. అక్కడకు తెచ్చాక చనిపోయినా.. ఆ సమాచారాన్ని ఆసుపత్రి వారు ఠాణాకు అందించాలి. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి సమాచారాన్ని పోలీసులకు చెప్పకుండా, ఆసుపత్రి వాళ్లు ఎమ్మెల్సీకి మృతదేహం ఎలా ఇచ్చారు?

మృతదేహాన్ని ఉదయం 10.30 గంటలకే తరలించినా... సాయంత్రం 6.15 గంటల వరకు పోస్టుమార్టం చేయలేదు. మార్చురీ వద్దకు తెదేపా నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు వచ్చినా లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు తాళాలు వేశారు. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని