నీట మునిగి నలుగురి మృతి
వారాంతపు సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన మరో ఇద్దరు వేర్వేరు చోట్ల నీట మునిగి
కొండపోచమ్మ జలాశయంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు..
హవేలి ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లిలో మరో ఇద్దరు
ములుగు, హవేలి ఘనపూర్, న్యూస్టుడే: వారాంతపు సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన మరో ఇద్దరు వేర్వేరు చోట్ల నీట మునిగి మృతిచెందారు. వీటికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందిన వడ్లమూలి అక్షయ వెంకట్ (27), సికింద్రాబాద్ బోయినపల్లిలోని మల్లికార్జున కాలనీకి చెందిన రాజన్శర్మ (27)లు గూగుల్ సంస్థలో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఆదివారం వీరిద్దరు రాంకోటికి చెందిన మరో మిత్రుడు రుషబ్షాతో కలిసి కారులో సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలోని కొండపోచమ్మ జలాశయాన్ని చూసేందుకు వచ్చారు. ఉదయం 6 గంటలకు సరదాగా ఈత కొడదామని అక్షయ వెంకట్, రాజన్శర్మలు జలాశయంలోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఒడ్డున ఉన్న రుషబ్షా మిత్రులిద్దరూ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమందించారు. వారు గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం మృతదేహాలు లభించాయి. అక్షయ వెంకట్, రాజన్శర్మలు వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారులు కావడం గమనార్హం. చేతికొచ్చిన కుమారులిద్దరూ జలాశయంలో పడి మృత్యువాత పడటంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనాస్థలంలో మద్యం సీసాలు ఉండడంతో మృతులు తాగి మత్తులో ఈత కొట్టేందుకు వెళ్లి ఉంటారని ములుగు ఎస్సై రంగ కృష్ణగౌడ్ తెలిపారు.
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 3 రోజులుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన ఎరుకల నాగమణి సోదరుడు మెదక్ మండలం రాజ్పల్లి గ్రామానికి చెందిన గంగారాం (34).. భార్య మంగమ్మ, పిల్లలతో కలిసి తిమ్మాయిపల్లికి వచ్చారు. నాగమణి సోదరి సుశీల కుమారుడు దేవరాయ లక్ష్మణ్ (18) తన తల్లి, సోదరితో కలిసి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. సుశీల అనారోగ్యంతో ఉన్నప్పుడు తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో పల్లె పోచమ్మకు మొక్కుకున్నారు. ఈ మేరకు మొక్కు తీర్చుకునేందుకు ఆదివారం అందరూ కలిసి వెళ్లారు. అనంతరం గ్రామ సమీపంలోని గిద్ద కుంటలోకి కుటుంబ సభ్యులందరూ కలిసి స్నానం చేద్దామని దిగారు. ఈ క్రమంలో గంగారాం, లక్ష్మణ్లు కాస్త ముందుకు వెళ్లడంతో లోతు తెలియక గుంతలో ఒకరి తర్వాత నీట మునిగారు. బంధువులు వారిని కాపాడేందుకు చీర అందించినా ప్రయత్నం ఫలించలేదు. అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈతగాళ్ల సాయంతో గాలించగా.. మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్సై మురళి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ