Telangana News: కారులో చిక్కుకుపోయి బాలిక దుర్మరణం

కారులో చిక్కుకొని బాలిక మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ నాగనూల్‌ బీసీ కాలనీకి చెందిన అంజమ్మ

Updated : 05 Jun 2022 08:08 IST

కందనూలు, న్యూస్‌టుడే: కారులో చిక్కుకొని బాలిక మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ నాగనూల్‌ బీసీ కాలనీకి చెందిన అంజమ్మ పట్టణంలో చెత్త కాగితాలు సేకరించడంతో పాటు ఇనుప సామాను దుకాణంలో కూలి పని చేస్తూ ఉపాధి పొందుతోంది. ఆమె కుమార్తె సుగుణ (9) పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఈ నెల 2న (గురువారం) మధ్యాహ్నం తల్లి కూలి పనికి వెళ్లాక చిన్నారి మధురానగర్‌ కాలనీలో చెత్తను సేకరించడానికి వెళ్లింది. అదే కాలనీలో నివాసముంటున్న సయ్యద్‌ ఇమ్రాన్‌ పాషా తన కారు ఇంటి వెనుక ఖాళీ స్థలంలో నిలిపారు. అటుగా వెళ్లిన అమ్మాయి కారు డోరును పట్టుకోగా అది సులువుగా తెరుచుకుంది. అందులోకి వెళ్లి డోరు వేసుకొని చిక్కుకుపోయింది. రాత్రి అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో.. తల్లి తెలిసిన ఇళ్లలో వాకబు చేసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు రాత్రి కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కారులోని మృతదేహాన్ని జనరల్‌ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో శనివారం పోలీసులు సంఘటనా స్థలానికి సమీపంలో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని