తహసీల్దార్‌ సజీవ దహన ఘటనలో గాయపడ్డ రైతు మృతి

గతంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో గాయపడిన రైతు బొడిగె నారాయణగౌడ్‌(73).. పాసుపుస్తకాలు అందుకోకుండానే

Published : 10 Aug 2022 05:41 IST

ఇప్పటికీ నారాయణగౌడ్‌కు దక్కని పాసుపుస్తకం

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: గతంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో గాయపడిన రైతు బొడిగె నారాయణగౌడ్‌(73).. పాసుపుస్తకాలు అందుకోకుండానే అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. 2019 నవంబరు 4న విధుల్లో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై మండలంలోని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించగా..ఆ ఘటనలో మంటలంటుకొని సురేష్‌, విజయారెడ్డిని కాపాడే క్రమంలో డ్రైవర్‌ గురునాథం, అటెండర్‌ చంద్రయ్య, పాసుపుస్తకాల కోసం వెళ్లిన రైతు నారాయణగౌడ్‌లు గాయపడ్డారు. విజయారెడ్డి ఘటనా సలంలోనే సజీవ దహనమైన విషయం తెలిసిందే. గాయపడిన నిందితుడు సురేష్‌, అటెండర్‌ చంద్రయ్య, డ్రైవర్‌ గురునాథంలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. రైతు నారాయణగౌడ్‌ మాత్రం కోలుకున్నారు.అయితే తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమై ఏడాది గడిచినా తన సమస్య పరిష్కారం కాలేదని.. కాలిన గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా.. పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని 2020 నవంబరు 3న నారాయణగౌడ్‌.. తహసీల్దార్‌ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు చేశారు. దాంతో అప్పట్లో ప్రభుత్వం స్పందించి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. నారాయణగౌడ్‌.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకొని అనారోగ్యం బారిన పడినా.. ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆయన కుటుంబ సభ్యులు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని