అబ్దుల్‌ బారిక్‌ ఆచూకీ చెబితే నజరానా

బంగ్లాదేశ్‌ యువతుల్ని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి భారత్‌లోకి అక్రమంగా దిగుమతి చేసిన ముఠా సూత్రధారి, బంగ్లాదేశ్‌ జాతీయుడు అబ్దుల్‌ బారిక్‌ షేక్‌ కోసం జాతీయ దర్యాప్తు

Published : 10 Aug 2022 05:41 IST

అంతర్జాతీయ లైంగిక అక్రమ రవాణా వ్యవహారం

సూత్రధారి బంగ్లాదేశ్‌ జాతీయుడి వేటలో ఎన్‌ఐఏ

ఈనాడు, హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌ యువతుల్ని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి భారత్‌లోకి అక్రమంగా దిగుమతి చేసిన ముఠా సూత్రధారి, బంగ్లాదేశ్‌ జాతీయుడు అబ్దుల్‌ బారిక్‌ షేక్‌ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గాలింపు తీవ్రం చేసింది. బారిక్‌తో పాటు ఇదే కేసులో ఏడో నిందితుడు, మహారాష్ట్ర థానేలో నివసించిన షరీపుల్‌ షేక్‌ ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష చొప్పున బహుమతులిస్తామని ప్రకటించింది. వీరు బంగ్లా యువతులను పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, 24 పరగణాల జిల్లా ద్వారా దేశం దాటించి హైదరాబాద్‌ సహా పలు మెట్రో నగరాల్లో వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ ముఠా తొలుత 2019 సెప్టెంబరులో రాచకొండ పోలీసులకు చిక్కింది. అంతర్జాతీయ ముఠా కావడంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. ఈకేసులో ఇప్పటికే 12 మందిపై అభియోగాలు మోపింది. వీరిలో 9 మంది బంగ్లాదేశ్‌ జాతీయులున్నారు.

బారిక్‌ ఖాతాకు కమీషన్ల బదిలీ
ఎన్‌ఐఏ దర్యాప్తులో బంగ్లాదేశ్‌లోని జెస్సోర్‌ జిల్లా బాక్రా గ్రామానికి చెందిన అబ్దుల్‌ బారిక్‌ షేక్‌తోపాటు పశ్చిమబెంగాల్‌కు చెందిన రుహుల్‌ అమీన్‌ డాలీలు ప్రధాన సూత్రధాలుగా తేలింది. వీరిద్దరూ అసద్‌ హసన్‌, షరీఫుల్‌ షేక్‌, మహ్మద్‌ యూసుఫ్‌ఖాన్‌, బిత్తీబేగం, మహ్మద్‌ అల్‌ మమూన్‌, సోజిబ్‌ షేక్‌, సురేశ్‌కుమార్‌ దాస్‌, మహ్మద్‌ అబ్దుల్లా మున్షి, మహ్మద్‌ రాణా హుస్సేన్‌(బంగ్లాదేశ్‌)తో కలిసి వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు తేలింది. అబ్దుల్‌, షరీపుల్‌ మినహా మిగిలిన వారంతా గతంలోనే ఎన్‌ఐఏకు చిక్కారు. ఈ ముఠా బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు... భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కూ యువతుల్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. 19-25 ఏళ్ల వయసున్న అమ్మాయిల్ని ఎంచుకొని ఉద్యోగాలు ఆశ చూపి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని గుర్తించారు. బాధితురాళ్లకు నకిలీ ధ్రువీకరణ పత్రాలను ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. డాలీ, అబ్దుల్‌ బ్యాంకు ఖాతాలకు అంతర్జాతీయ ముఠాల ద్వారా కమీషన్లు బదిలీ అవుతున్నట్లు ఆధారాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు