భార్యపై కోపం.. సైకోగా మార్చింది!

కట్టుకున్న భార్య వివాహేతర సంబంధాన్ని చూసి ఆడవాళ్లంటే అసహ్యం పెంచుకున్నాడు. కుటుంబానికి పూర్తిగా దూరమై సైకోగా మారాడు. ఆడవాళ్లే లక్ష్యంగా హత్యలకు తెగబడ్డాడు. విశాఖ జిల్లా పెందుర్తిలో కలకలం

Updated : 17 Aug 2022 09:50 IST

వరస హత్యల నిందితుడి అరెస్టు
కాపలాదారులే లక్ష్యంగా విశాఖలో అఘాయిత్యాలు

ఎం.వి.పి.కాలనీ (విశాఖ), న్యూస్‌టుడే: కట్టుకున్న భార్య వివాహేతర సంబంధాన్ని చూసి ఆడవాళ్లంటే అసహ్యం పెంచుకున్నాడు. కుటుంబానికి పూర్తిగా దూరమై సైకోగా మారాడు. ఆడవాళ్లే లక్ష్యంగా హత్యలకు తెగబడ్డాడు. విశాఖ జిల్లా పెందుర్తిలో కలకలం రేపిన వరుస హత్యల నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. విశాఖ పోలీసు కమిషనర్‌ మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరానికి చెందిన చందక రాంబాబు (49)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2006లో కుటుంబం సహా హైదరాబాద్‌ వెళ్లి రియల్‌ ఎస్టేట్‌లో పనిచేసేవాడు. అక్కడ బిల్డర్‌ మోసం చేశాడు. తర్వాత కుటుంబాన్ని అక్కడే ఉంచి, కొన్నాళ్లు విశాఖలో ఉన్నాడు. 2016లో ఓసారి హైదరాబాద్‌ వెళ్లినప్పుడు భార్య ప్రవర్తన చూసి, ఆమెకు విడాకులు ఇచ్చాడు. పిల్లలు సైతం రాంబాబును దూరం పెట్టారు. పెందుర్తిలో ఓ అద్దె ఇంట్లో ఉండగా, అతని ప్రవర్తన నచ్చక ఇంటి యజమాని ఖాళీ చేయించారు. భార్యపై కోపంతో రాంబాబు మహిళా ద్వేషిగా మారాడు. అపార్టుమెంట్ల నిర్మాణం వద్ద మహిళలు కుటుంబాలతో సహా కాపలాగా ఉంటారన్న అవగాహనతో వారినే లక్ష్యంగా చేసుకొన్నాడు. కిలో బరువున్న ఇనుపరాడ్‌ కొని పట్టుకోవడానికి వీలుగా దానికి రంధ్రం చేసి తాడుకట్టాడు. 2 చొక్కాలు ధరించి వాటి మధ్యలో రాడ్‌ దాస్తుండేవాడు. జులై 9న రాత్రి పెందుర్తి బృందావన్‌గార్డెన్స్‌లో అపార్టుమెంట్‌ కాపలాదారు టి.నల్లమ్మపై దాడిచేశాడు. ఆమె గాయాలపాలైంది. ఆగస్టు 8న చినముషిడివాడలో అపార్టుమెంట్‌ కాపలాదారులుగా ఉన్న ఎస్‌.అప్పారావు(72), లక్ష్మీ(62)లను రాడ్‌తో కొట్టి చంపాడు. ఆగస్టు 14న సుజాతనగర్‌ నాగమల్లి లేఅవుట్‌లో వాచ్‌మన్‌ ఎ.లక్ష్మీని హత్య చేశాడు. ఒకే తరహాలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు దృష్టి సారించారు. లక్ష్మీ హత్య తర్వాత పోలీసులు వెంటనే రారన్న భావనతో రాంబాబు అదే ప్రాంతంలోనే తిరుగుతుండగా పోలీసులు అనుమానంతో ఆరా తీయగా వాస్తవాలు వెలుగుచూశాయి. చీకట్లోనే హత్యలు చేసే రాంబాబు.. వారు మహిళలో కాదో నిర్ధారించుకునేందుకు ప్రైవేటు భాగాలను పరిశీలించేవాడని, ఎవరిపైనా లైంగిక అఘాయిత్యానికి పాల్పడలేదని పోలీసులు తెలిపారు. కల్యాణ మండపాల్లో, ఆలయాల్లో తింటూ గడుపుతున్నట్లు గుర్తించారు. మరోసారి రాంబాబును పోలీసు కస్టడికి తీసుకుని, విచారణ జరుపుతామని సీపీ శ్రీకాంత్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని