Vizag: విశాఖలో రౌడీషీటర్‌ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం

విశాఖపట్నంలో బుధవారం సాయంత్రం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ రౌడీషీటర్‌ హత్యకు గురయ్యారు. ఎంవీపీ కాలనీ ఉషోదయ కూడలిలో బుధవారం ఇద్దరు యువకులు

Published : 18 Aug 2022 06:44 IST

ఈనాడు- విశాఖపట్నం, న్యూస్‌టుడే- ఎం.వి.పి.కాలనీ, పెదవాల్తేరు: విశాఖపట్నంలో బుధవారం సాయంత్రం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ రౌడీషీటర్‌ హత్యకు గురయ్యారు. ఎంవీపీ కాలనీ ఉషోదయ కూడలిలో బుధవారం ఇద్దరు యువకులు అతణ్ని  కత్తితో పొడిచి, పీక కోసి పాశవికంగా హత్య చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వారు తేరుకోకముందే నిందితులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. అందరూ స్నేహితులే అయినప్పటికీ అంతర్గతంగా పెంచుకున్న ద్వేషం చివరకు రౌడీషీటర్‌ దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ అప్పుఘర్‌కు చెందిన బి.అనిల్‌కుమార్‌ (36), ఎంవీపీ కాలనీ ఆదర్శనగర్‌లో ఉంటున్న శ్యామ్‌ప్రకాశ్‌ స్నేహితులు. కారు డ్రైవర్‌గా పనిచేసే అనిల్‌కుమార్‌ రౌడీషీటర్‌ కాగా బస్సుడ్రైవర్‌ శ్యామ్‌ప్రకాశ్‌పై 498ఎ కేసు ఉంది. ఓ హత్య కేసులో నిందితుడైన అనిల్‌కుమార్‌పై కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో రౌడీషీట్‌ కూడా ఉంది. తన గురించి అనిల్‌కుమార్‌ హేళనగా మాట్లాడుతున్నట్లు తెలిసిన శ్యామ్‌ప్రకాశ్‌ అతనిపై కోపం పెంచుకున్నాడు. గతంలో క్రికెట్‌ ఆడుతూ.. ఇద్దరూ గొడవపడినప్పటికీ చుట్టుపక్కలవారు రాజీ చేయడంతో మళ్లీ స్నేహితులయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఉషోదయ కూడలిలోని అనుపమ బార్‌లో అనిల్‌కుమార్‌, శ్యామ్‌ప్రకాశ్‌, షమీర్‌, ఎర్రయ్య అనే నలుగురు మిత్రులు మద్యం తాగారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో వారిలో ఒకరు బయటకు వెళ్లి మళ్లీ వచ్చారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల మధ్యలో బార్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత మళ్లీ అనిల్‌తో వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాటతోపాటు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ తరువాత శ్యామ్‌ప్రకాశ్‌, మరొకరు కలిసి అనిల్‌పై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. దవడలపై, ఎడమభుజంపై, ఛాతీ, పొట్టపైనా పొడిచి, పీక కోసి అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావమవడంతో అనిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానిక యువకులతోనూ వివాదాలు: అనిల్‌కుమార్‌కు స్థానిక యువకులు కొందరితో విభేదాలున్నాయి. అయితే రౌడీషీటర్‌ కావడంతో వారి అసంతృప్తిని బయటకు చెప్పలేకపోయేవారు. మరోవైపు బుధవారం కూడా అనిల్‌ తనను అవమానించేలా మాట్లాడటాన్ని శ్యామ్‌ప్రకాశ్‌ జీర్ణించుకోలేకపోయాడు. అప్పటికప్పుడు హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళిక ప్రకారం అనిల్‌ను బార్‌కు తీసుకొచ్చేరేమోనన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. మధ్యలో ఓ వ్యక్తి కత్తి కోసమే బయటకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. శ్యామ్‌ప్రకాశ్‌ను అనిల్‌ హేళనగా మాట్లాడటం, బార్‌లో పాత వివాదాలు చర్చకు రావడం హత్యకు దారితీసినట్లు ద్వారకా సబ్‌డివిజన్‌ ఏసీపీ ఆర్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి తెలిపారు. నిందితుడు శ్యాంప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని