Hyderabad News: ప్రేయసి మరణం.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని తెలిసి ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్‌, మంగ దంపతులకు

Published : 18 Aug 2022 08:15 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని తెలిసి ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్‌, మంగ దంపతులకు కుమార్తె, కుమారుడు శ్రీకాంత్‌(19) ఉన్నారు. హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌లోని వినాయక్‌నగర్‌లో ఉంటున్నారు. శ్రీకాంత్‌ ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి కొంతకాలం క్రితం రాజేంద్రనగర్‌కు చెందిన యువతి(19) ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమకు దారితీసింది. యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించకపోవటంతో జూన్‌ 4న గుడిలో పెళ్లి చేసుకున్నారు. వినాయక్‌నగర్‌లోనే కొంతకాలం కలిసే ఉన్నారు.

వివాహ వయసు (21 ఏళ్లు) రాకుండానే పెళ్లిచేసుకోవటం చట్టవిరుద్ధమంటూ యువతి కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జులై 28న యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తమను విడదీశారనే మనోవేదనతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆగస్టు 15న శ్రీకాంత్‌కు తెలిసింది. అప్పట్నుంచి మనస్తాపంతో ఉన్న అతను బుధవారం ఉదయం అల్పాహారం చేస్తానని చెప్పి అక్క దగ్గర రూ.500 తీసుకొని బయటకు వచ్చాడు. 10 గంటల సమయంలో వివేకానగర్‌ సమీపంలోని రోడ్డు పక్కన తోపుడు బండి వద్ద అల్పాహారం తీసుకున్నాడు. అదే సమయంలో అమ్ముగూడ-మౌలాలి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు రావటాన్ని గమనించి, తినే ప్లేటు అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని