ప్రేమికులైన ఇద్దరు మైనర్ల మృతి

ప్రేమికులైన ఇద్దరు మైనర్లు కేవలం కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో విషాదం నింపింది. బాలిక జ్వరంతో బాధపడుతూ మృతి చెందగా.. అది తట్టుకోలేక బాలుడు బలవన్మరణానికి

Published : 19 Aug 2022 04:42 IST

బాలిక మృతిని జీర్ణించుకోలేక బాలుడి బలవన్మరణం

చిల్లకూరు, న్యూస్‌టుడే: ప్రేమికులైన ఇద్దరు మైనర్లు కేవలం కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో విషాదం నింపింది. బాలిక జ్వరంతో బాధపడుతూ మృతి చెందగా.. అది తట్టుకోలేక బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీకాళహస్తి మండలం తొట్టంబేడు మండలంలోని ఓ గిరిజన కాలనీకి చెందిన బాలిక (14), బాలుడు (18) పరస్పరం ప్రేమించుకున్నారు. పెద్దల నుంచి అభ్యంతరాలు ఎదురైన నేపథ్యంలో నెల కిందట వారిద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తమ్మినపట్నం గ్రామంలోని బాలుడి బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పదిరోజుల నుంచి బాలికకు జ్వరం ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స చేయించారు. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై ఆ బాలిక మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ బాలిక మృతిని జీర్ణించుకోలేకపోవడంతో పాటు ఆమె తల్లిదండ్రులు వస్తే ఏమైనా చేస్తారన్న భయంతో ఆ బాలుడు గ్రామానికి సమీపంలోని వేరుసెనగ తోటలో పనిచేస్తున్న బంధువుల వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం పొలంలోనే ఉన్న విష గుళికలు మింగేశాడు. బంధువులు గుర్తించేసరికి అతను విగతాజీవిగా మారాడు. మృతదేహాలను గ్రామంలోనే ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని