Secunderabad: సికింద్రాబాద్‌లో ఘోరం

సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు.

Updated : 13 Sep 2022 06:35 IST

అగ్ని ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం.. పది మందికి గాయాలు

 ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూంలో మంటలు చెలరేగడంతో ఘటన

  పైనున్న లాడ్జికి వ్యాపించిన అగ్నికీలలు

 పొగలు వ్యాపించి భీతావహ పరిస్థితి

 చిక్కుకున్న పర్యాటకులు.. కొనసాగుతున్న సహాయ చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, రెజిమెంటల్‌బజార్‌, గాంధీ ఆసుపత్రి: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, మహిళ ఉన్నారు. వీరి వయసు 35 నుంచి 40 ఏళ్లలోపు అని సమాచారం. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో విజయవాడకు చెందిన ఎ.హరీశ్‌, చెన్నై వాసి సీతారామన్‌, దిల్లీ వాసి వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ఓ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూంలో చెలరేగిన మంటలతో.. పైఅంతస్తుల్లో ఉన్న లాడ్జిలో పర్యాటకులు ప్రమాదం బారిన పడ్డారు. పొగ దట్టంగా వ్యాపించి పలువురు స్పృహ కోల్పోయి లాడ్జిలోని గదులు, ఆవరణలో పడి ఉన్నారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోండా మార్కెట్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటనకు వివరాలు ఇలా ఉన్నాయి.

పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్‌ పేరిట అయిదంతస్తుల భవనం ఉంది. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్‌ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.40 గంటల ప్రాంతంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇవి వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల మంటల ఉద్ధృతి మరింత పెరిగింది. వాహనాలకు వ్యాపించడంతో పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. మెట్లమార్గం ద్వారా పైఅంతస్తులకు వ్యాపించాయి. దీనికితోడు వాహనాలు, బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించాయి.

లాడ్జిలో 25 మంది పర్యాటకులు

లాడ్జిలో 23 గదులున్నాయి. దాదాపు25 మంది పర్యాటకులున్నట్లు అంచనా. ప్రమాదంతో ఒక్కసారిగా హోటల్‌లోని పర్యాటకులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో హాహాకారాలు చేయసాగారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో ఏమైందోనని భయాందోళనకు గురయ్యారు. వాహనాల నుంచి వెలువడిన పొగ కారణంగా ఊపిరి ఆడక కొందరు స్పృహ తప్పి లాడ్జి గదులలో, కారిడార్‌లో పడిపోయారు. దట్టంగా పొగచూరడంతో శ్వాస తీసుకునే పరిస్థితి లేక ఏడుగురు పర్యాటకులు చనిపోయారు. మంటలు అంటుకుని నలుగురు, ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కిందికి దూకి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు అగ్నిమాపక శాఖాధికారులు హైడ్రాలిక్‌ క్రేన్‌ రప్పించి లాడ్జిలో చిక్కుకున్న వారిని కాపాడే చర్యలు చేపట్టారు.

గాంధీ ఆసుపత్రిలో చికిత్స

క్షతగాత్రులను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. 30 మంది వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ రాజారావు వివరించారు.

ప్రమాదస్థలిని పరిశీలించిన మంత్రులు

ఘటన విషయం తెలుసుకుని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే సాయన్న చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, క్షతగాత్రులను గాంధీ, యశోద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నగర సీపీ ఆనంద్‌, అగ్నిమాపక శాఖ అదనపు డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, డీసీపీ చందనాదీప్తి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల భవనాలు ఉండటంతో మంటలు వ్యాపిస్తాయన్న ఆందోళనతో ముందుగానే పోలీసులు ఖాళీ చేయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని