Tadepalligudem: భార్యపై కోపం.. కుమార్తెలకు నరకం: పిల్లలను కొడుతూ వీడియో చిత్రీకరణ

భార్యపై కోపంతో ఉన్మాదిలా మారాడొక భర్త. కన్న బిడ్డలని కూడా చూడకుండా చిన్నారులను చిత్రహింసలకు గురి చేశాడు. పైగా ఆ దృశ్యాలను వీడియో తీసి భార్యకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నాడు. పశ్చిమగోదావరి

Updated : 16 Sep 2022 08:37 IST

దుబాయ్‌లోని భార్యకు పంపి బెదిరింపులు

పెంటపాడు, న్యూస్‌టుడే: భార్యపై కోపంతో ఉన్మాదిలా మారాడొక భర్త. కన్న బిడ్డలని కూడా చూడకుండా చిన్నారులను చిత్రహింసలకు గురి చేశాడు. పైగా ఆ దృశ్యాలను వీడియో తీసి భార్యకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసిందీ దారుణం. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదుకు భార్య నిర్మల, 11, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన అతడు ఏ పనీ లేకుండా తిరిగేవాడు. భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆమె పిల్లలను భర్త వద్ద వదిలి జీవనోపాధి కోసం దుబాయ్‌ వెళ్లింది. పిల్లలను తీసుకుని దావీదు ఇటీవల పెంటపాడుకు మకాం మార్చాడు. భార్యను ఎలాగైనా దుబాయ్‌ నుంచి రప్పించాలనే ఉద్దేశంతో కుమార్తెలను విచక్షణరహితంగా కొడుతూ.. చంపేస్తానని కత్తితో బెదిరిస్తూ.. వారు భయంతో కేకలు వేస్తుంటే ఆ దృశ్యాలను కొడుకుతోనే వీడియో తీయించి ఆమెకు పంపడం మొదలెట్టాడు. అవి చూసి తల్లడిల్లిన ఆమె వాటిని గ్రామంలోని సర్పంచికి పంపగా ఆయన పోలీసులకు తెలియజేశారు. తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ మూర్తి, ఎస్సై జి.సత్యనారాయణ గ్రామానికి చేరుకుని పిల్లల నుంచి వివరాలను సేకరించి కేసు నమోదుచేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని