భుజాన నాగలి.. మృత్యు కౌగిలి!
పొలం పనుల కోసం ఉదయాన్నే బయలుదేరిన రైతన్న క్షణాల్లో విగత జీవిగా మారిపోయారు. భుజాన ఇనుప నాగలి వేసుకుని వెళ్లడమే ఆయన పాలిటి శాపమైంది. అది
కరెంటు తీగ తగిలి రైతు మృతి
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
దుంపిల్లపల్లి (రేగొండ), న్యూస్టుడే: పొలం పనుల కోసం ఉదయాన్నే బయలుదేరిన రైతన్న క్షణాల్లో విగత జీవిగా మారిపోయారు. భుజాన ఇనుప నాగలి వేసుకుని వెళ్లడమే ఆయన పాలిటి శాపమైంది. అది తగిలేంత కిందికి విద్యుత్ తీగలు వేలాడుతున్నా... పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యానికి ఆయన బలయ్యారు. నాగలి విద్యుత్ తీగకు చిక్కుకుని ఉండగానే కన్నుమూసిన కుమారస్వామిని చూసి కుటుంబసభ్యులు, రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ప్రమాదం జయశంకర్ జిల్లా రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామంలో జరిగింది. రైతులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. దుంపిల్లపల్లికి చెందిన రైతు కుమారస్వామి(45)కి ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్దకు ఆయన శుక్రవారం ఉదయాన్నే వెళ్లారు. అక్కడ ఉన్న ఇనుప అచ్చు నాగలిని భుజంపై పెట్టుకొని మరో బావి వద్దకు వెళ్తుండగా పంట చేనులో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు దానికి తగిలాయి. దాంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
రైతు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహంతో రేగొండ సబ్స్టేషన్ ముందు పరకాల-భూపాలపల్లి జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేశారు. రైతు మృతికి కారకులైన విద్యుత్శాఖ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీకాంత్రెడ్డి అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.విద్యుత్శాఖ, ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వటంతో ధర్నాను విరమించారు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
కుమారస్వామి చేనుతో పాటు మరో ముగ్గురు రైతుల పంటపొలాల్లో తీగలు కిందికి వేలాడుతున్నట్లు గతంలోనే విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశామని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి ఉంటే రైతు ప్రాణం పోయేది కాదని వారు వాపోయారు. ఈ విషయంపై ‘న్యూస్టుడే’ విద్యుత్శాఖ ఏఈ కనకయ్యను వివరణ కోరగా.. కుమారస్వామి భూమిలో తీగలు కిందికి వేలాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తీగల మధ్యలో స్తంభం ఏర్పాటు చేస్తామని ఆ ప్రాంతంలోని రైతులకు తెలుపగా.. తమ భూముల్లో స్తంభాలు వేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.