Vizag: ఎవరికో రుణమిచ్చి మహిళను ఇరికించి.. కాల్ గర్ల్‌గా ప్రచారం చేస్తామని బెదిరింపులు

ఎవరికో రుణమిచ్చి, దాన్ని చెల్లించకుంటే కాల్‌గర్ల్‌ అని ప్రచారం చేస్తామని సంబంధం లేని మహిళను బెదిరించిన వ్యక్తులను విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు. ఈమేరకు బుధవారం నగర పోలీసులు తెలిపిన ప్రకారం..

Updated : 29 Sep 2022 10:49 IST

ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: ఎవరికో రుణమిచ్చి, దాన్ని చెల్లించకుంటే కాల్‌గర్ల్‌ అని ప్రచారం చేస్తామని సంబంధం లేని మహిళను బెదిరించిన వ్యక్తులను విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు. ఈమేరకు బుధవారం నగర పోలీసులు తెలిపిన ప్రకారం... రుణయాప్‌ సంస్థ వారు విశాఖకు చెందిన ఓ వ్యక్తికి రూ.4 వేలు, రూ.2500, రూ.2500 చొప్పున మూడుసార్లు రుణాలిచ్చారు. వాటిని అతను తిరిగి చెల్లించారు.

ఆయన అడగకముందే మరోసారి రూ.4 వేలు అతని ఖాతాలో వేయగా వాటిని అతను కట్టలేదు. అతని కాంటాక్టు లిస్టులో పేరున్నందుకు... తమ వద్ద తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లించాలని లేదంటే, రుణాలను ఎగ్గొట్టే వ్యక్తిగా పేర్కొంటూ బంధువులకు పోస్టులు పంపుతామని విశాఖకు చెందిన ఓ మహిళకు బెదిరింపు సందేశాలు పంపించారు. ఆమె ఫొటో కింద కాల్‌గర్ల్‌ అని రాసి, ఫోన్‌ నంబరు కూడా ఉంచి వాట్సప్‌ సందేశం చేశారు. భయపడిన బాధితురాలు ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతరం సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా సీఐ భవానీప్రసాద్‌ కేసు దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుల వాట్సప్‌ లొకేషన్‌ అస్సాంలో, బ్యాంకు ఖాతా నంబరు హరియాణాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇతర మొబైల్‌ నంబర్లను పరిశీలించగా నిందితులది దిల్లీగా గుర్తించారు. ఇలా చేస్తున్నది నేహాకుమారీగా తేల్చారు. నేహాకుమారీ, ఆమె సోదరి పూజ ఇద్దరూ టెలి పెర్ఫార్మెన్స్‌లో శిక్షకులుగా పనిచేస్తున్నారు. ఆమె తమ్ముడైన రాహుల్‌ మోహతా... నేహాకుమారి హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాలను ఉపయోగిస్తున్నారు.

ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించారు. రాహుల్‌మెహతా అతనికి సహకరిస్తున్న అభిషేక్‌లను అరెస్టు చేశారు. నేహాకుమారికి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అరెస్టు చేసిన ఇద్దరిని దిల్లీ ద్వారకా కోర్టులో హాజరుపరిచి, విశాఖకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి 15 రోజుల రిమాండు విధించింది. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని