ఎన్‌ఐఏ అధికారులమంటూ బెదిరింపులు

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి తాము జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులమంటూ పలువురిని బెదిరింపులకు పాల్పడినట్లు

Published : 01 Oct 2022 05:52 IST

ఓ ప్రొఫెసర్‌ ఫిర్యాదుతో గుట్టు రట్టు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి తాము జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులమంటూ పలువురిని బెదిరింపులకు పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కమిషనరేట్‌ పరిధిలో ఈ ముఠా కొందరి వద్దకు వెళ్లి ‘‘మీకు పీఎఫ్‌ఐతో సంబంధాలున్నాయి. మేము ఎన్‌ఐఏ అధికారులమంటూ’’ పరిచయం చేసుకొని విచారణ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆందోళనకు గురైన కొంతమంది వారికి తోచిన డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఈక్రమంలో ముఠా ఓ ప్రొఫెసర్‌ వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడింది. అనుమానం వచ్చిన ఆయన తనకు తెలిసిన పోలీసు అధికారికి సమాచారం ఇచ్చారు. వరంగల్‌ కమిషనరేట్‌కు ఎన్‌ఐఏ అధికారులు ఎవరూ రాలేదని, ఎలాంటి విచారణ చేయలేదని చెప్పడంతో ప్రొఫెసర్‌ వచ్చిన వారిని గుర్తింపు కార్డులు చూపాలని కోరారు. దాంతో వారు అక్కణ్నుంచి పరారయ్యారు. తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు వారి ఆచూకీ గుర్తించినట్లు తెలిసింది. నగరంలోనే ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. వీరు ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. విచారణ పూర్తయితే దీనిపై స్పష్టత రావచ్చని పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని