ఎస్‌ఐపై దిశ స్టేషన్‌లో కేసు నమోదు

ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌ను వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిన ఓ ఎస్‌ఐపై దిశ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.

Published : 04 Oct 2022 04:55 IST

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌ను వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిన ఓ ఎస్‌ఐపై దిశ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా కేంద్రమైన నెల్లూరులో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. సంతపేట పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ను రెండేళ్ల కిందట అదే స్టేషన్‌లో పనిచేసిన ఎస్‌ఐ మహబూబ్‌ సుభాని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని ఎస్‌ఐ కుటుంబ సభ్యులు సమ్మతించకపోవడంతో పొదలకూరు రోడ్డు ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వారు కాపురం ఉంటున్నారు. అయితే కొంతకాలంగా భార్యను వేధించసాగాడు. అలాగే భార్యను విడిచి పెట్టివస్తే మరో వివాహం చేస్తామని ఎస్‌ఐని ఆయన తల్లి, కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. దీంతో భార్యను మరింత వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. గత నెల 9న తల్లితో కలిసి ఆమెపై దాడి చేసి ఇంట్లో నిర్బంధించాడు. ఆమె డయల్‌ 100కు ఫోను చేయడంతో పోలీసులు వచ్చి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వెళ్లారు. ఈ క్రమంలో భార్యపై దాడి చేసి విధులకు సెలవు పెట్టి ఆయన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు నాలుగు రోజుల క్రితం ఎస్‌ఐపై అదనపు కట్నం వేధింపులు, హత్యాయత్నానికి పాల్పడినట్లుగా ఎస్‌ఐ లేఖా ప్రియాంక కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ సీహెచ్‌ విజయరావు వెంటనే మహబూబ్‌ సుభానీని అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని