సరికొత్త సర్వీస్‌ మోసం

నకిలీ కాల్‌సెంటర్ల ద్వారా ఉద్యోగం, లక్కీడ్రా,బహుమతులు అంటూ మోసాలు చేయడం చూశాం. ఓ ముఠా అంతకుమించిన ఎత్తుగడతో భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కింది.

Published : 05 Oct 2022 05:46 IST

ప్రముఖ బ్రాండ్ల ప్రతినిధులమంటూ సేవలు

సాధారణ రుసుముల కంటే అదనంగా వసూలు

హైదరాబాద్‌లో నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు

దేశవ్యాప్తంగా వేల మందికి బురిడీ

ఇద్దరిని అరెస్ట్‌ చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ కాల్‌సెంటర్ల ద్వారా ఉద్యోగం, లక్కీడ్రా,బహుమతులు అంటూ మోసాలు చేయడం చూశాం. ఓ ముఠా అంతకుమించిన ఎత్తుగడతో భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కింది. వివిధ బ్రాండ్ల గృహోపకరణాల మరమ్మతులకు గూగుల్‌లో నంబర్లు వెతికి ఆయా సంస్థల కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తుంటాం. దీన్ని ఆసరాగా చేసుకున్న ఈ ముఠా ఆన్‌లైన్‌లో నకిలీ కాల్‌సెంటర్‌ నంబర్లు ఉంచి ఫోన్లు స్వీకరిస్తున్నాయి. తామే ఆయా బ్రాండ్ల ప్రతినిధులమంటూ..సర్వీస్‌ ఏజెంట్లను పంపిస్తున్నాయి. అసలు సంస్థలు తీసుకునే రుసుముల కంటే 60 శాతం అధికంగా వసూలు చేస్తూ కొన్నేళ్లుగా వేల మందిని మోసగించాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, ముంబయి, నోయిడా, బెంగళూరు తదితర నగరాల్లో ఈ మోసాలు చేస్తున్న ముఠాలోని ఇద్దరు ప్రధాన సూత్రధారుల్ని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 555 ఫోన్లు, 1000 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ గజరావు భూపాల్‌ మంగళవారం కేసు వివరాలను విలేకరులకు తెలిపారు.

హైదరాబాద్‌ కేంద్రంగా
నగరానికి చెందిన మహ్మద్‌ సలీమ్‌, మహ్మద్‌ ఆరిఫ్‌లు రామంతాపూర్‌లోని కూర్మనగర్‌లో స్కైలైన్‌ కస్టమర్‌ కేర్‌, సర్వీసింగ్‌ సెంటర్‌, గ్లోబల్‌ టెక్నో సర్వీస్‌ పేరిట నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ప్రముఖ బ్రాండ్ల గృహోపకరణాల మరమ్మతులకు సర్వీసు చేస్తామంటూ గూగుల్‌లో ప్రకటనలు గుప్పించారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, ముంబయి, నోయిడా, బెంగళూరు సహా కొన్ని నగరాల్లోని వినియోగదారులు గూగుల్‌లో వెతికినప్పుడు తొలుత వీళ్ల నంబరు కనిపించేలా చేశారు. వినియోగదారులు కాల్‌ చేసినప్పుడు రామంతాపూర్‌లోని కూర్మనగర్‌లో ఉండే టెలీకాలర్లు మాట్లాడేవారు. ఇతర నగరాల్లోనూ వీరు టెక్నీషియన్లు, సర్వీస్‌ ఏజెంట్లను నియమించుకున్నారు. వినియోగదారుల నుంచి ఫోన్‌ రాగానే ఆయా నగరాల్లోని సదరు బ్రాండ్‌ ప్రతినిధుల పేరిట తమ టెక్నీషియన్లను పంపిస్తున్నారు. చిన్న మరమ్మతు అయినా రూ.2,500 నుంచి రూ.5 వేల వరకూ సగటున 60 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. మరమ్మతు చేయకపోయినా కనీస ఛార్జీ రూ.300 తీసుకుంటున్నారు. ఇలా నాలుగేళ్లుగా దందా నడిపించారు. రామంతాపూర్‌లోని కాల్‌సెంటర్‌ నుంచి రోజుకు సుమారు 500 వరకూ కాల్స్‌ స్వీకరిస్తూ.. రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఆర్జించారు. నకిలీ కాల్‌ సెంటర్‌ కోసం రామంతాపూర్‌లో ఏకంగా అపార్టుమెంట్‌ కట్టినట్లు సమాచారం. ఓ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో ముఠా వ్యవహారం వెలుగు చూసింది.

గూగుల్‌ను ఎలా ఏమారుస్తారంటే?
బ్రాండెడ్‌ సంస్థల స్థానంలో తమ కాల్‌సెంటర్‌కు ఫోన్లు వచ్చేందుకు నిందితులు గూగుల్‌లో ప్రకటనల్ని తెలివిగా ఏమార్చారు. గూగుల్‌లో తమ కాల్‌సెంటర్‌ నంబర్లకు వారి సిబ్బందితో ఎక్కువ క్లిక్కులు, హిట్లు ఇప్పించారు. దీంతో గూగుల్‌లో వివిధ బ్రాండ్ల కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం వెతికేవారికి.. అవే బ్రాండ్ల పేర్లతో ఉండే ఈ ముఠా నంబరు ముందు కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్‌ వస్తువులు మరమ్మతుకు గురైతే ఆయా బ్రాండ్లకు చెందిన అసలైన వెబ్‌సైట్లలోని నంబర్లను సంప్రదించాలని సంయుక్త సీపీ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని