దిల్లీ పాఠశాలలో దారుణం

దేశ రాజధాని దిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో దారుణం జరిగింది. విద్యాసంస్థలోని మరుగుదొడ్డిలో 11 ఏళ్ల ఓ విద్యార్థినిపై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 07 Oct 2022 06:15 IST

11 ఏళ్ల బాలికపై మరుగుదొడ్డిలో అఘాయిత్యం
నిందితులు ఇద్దరు సీనియర్‌ విద్యార్థులు
జులైలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
దిల్లీ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో దారుణం జరిగింది. విద్యాసంస్థలోని మరుగుదొడ్డిలో 11 ఏళ్ల ఓ విద్యార్థినిపై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జులైలోనే జరగ్గా.. దిల్లీ మహిళా కమిషన్‌ చొరవతో బాధితురాలు మంగళవారం పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. మరోవైపు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) ప్రాంతీయ కార్యాలయం కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది.

మరుగుదొడ్డిలోకి లాక్కెళ్లి ఘోరం..

ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్‌కు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జులైలో ఆ బాలిక తరగతి గదికి వెళ్తున్న క్రమంలో అనుకోకుండా 11, 12 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది. ఆపై తాను క్షమాపణలు చెప్పినా వారు దూషించారు. ఆ తర్వాత తనను బలవంతంగా మరుగుదొడ్డిలోకి లాక్కెళ్లి తలుపు వేసి సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు ఉపాధ్యాయురాలికి చెప్పినా పట్టించుకోలేదు. నిందితులిద్దరినీ పాఠశాల నుంచి బహిష్కరించినట్టు చెప్పి బాధితురాలిని బలవంతంగా నోరుమూయించారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్‌ స్వాతి మలివాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశ రాజధానిలో పిల్లలకు పాఠశాలలు కూడా సురక్షితం కాకపోవడం చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఈ అంశంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. పాఠశాల అధికారుల పాత్రపైనా విచారణ జరిపించాలన్నారు. మరోవైపు, పాఠశాల అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని కేవీఎస్‌ అధికారులు తెలిపారు. ప్రాంతీయ కార్యాలయం దీనిపై దర్యాప్తు చేస్తోందన్నారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయలేదని.. ఈ ఘటన తర్వాత జరిగిన టీచర్లు- తల్లిదండ్రుల సమావేశంలోనూ తమ దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తు తర్వాతే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దిల్లీ పోలీసుల దర్యాప్తునకు తాము సహకరిస్తామని కేవీఎస్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బోధనా సిబ్బంది, అనుమానిత విద్యార్థులను విచారించినట్టు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని