Suicide: ఇచ్చిన రుణాలే.. ఉరితాళ్లై బ్యాంకు మేనేజర్‌ బలవన్మరణం

బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ కాకపోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయి. దాంతో తానే అప్పులు చేసి ఖాతాదారుల రుణాలు చెల్లించిన ఓ బ్యాంకు మేనేజరు మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యానాంలో జరిగింది.

Updated : 12 Oct 2022 07:54 IST

యానాం, న్యూస్‌టుడే: బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ కాకపోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయి. దాంతో తానే అప్పులు చేసి ఖాతాదారుల రుణాలు చెల్లించిన ఓ బ్యాంకు మేనేజరు మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యానాంలో జరిగింది. ఎస్సై కనకారావు కథనం ప్రకారం.. సాయిరత్న శ్రీకాంత్‌ (33) ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌. భార్య, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆయన భార్య గాయత్రి పిల్లలను స్కూలుకు తీసుకునివెళ్లారు. అప్పటివరకు వారితో గడిపిన శ్రీకాంత్‌.. తర్వాత ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంటికి తిరిగివచ్చిన భార్య ఎన్నిసార్లు తలుపుకొట్టినా తెరవకపోవడంతో కిటకీలోంచి చూడగా.. శ్రీకాంత్‌ ఉరికి వేలాడుతూ కనిపించారు. తలుపులు పగలగొట్టి.. ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీకాంత్‌ యానాంకు రాకముందు మూడేళ్లపాటు మచిలీపట్నం బ్రాంచిలో మేనేజరుగా పనిచేశారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేశారు. తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోవడంతో బయట అప్పుచేసి రూ. 60 లక్షల వరకు శ్రీకాంతే చెల్లించారు. తర్వాత యానాంకు బదిలీపై వచ్చారు. ఇక్కడ కూడా మరో రూ. 37 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసిందని పోలీసు అధికారులు వివరించారు. విధి నిర్వహణలో సమస్యలతో తన భర్త మానసికంగా తీవ్ర ఒత్తిడితో ఉండేవారని భార్య గాయత్రి పోలీసులకు తెలిపారు. అప్పులు త్వరలో తీరిపోతాయని గత రాత్రే ఎంతో ఆనందంగా చెప్పారని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని