Drugs Case: గోవా డాన్‌ని.. నన్నెవ్వరూ తాకలేరు!

జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిచయాలు. ఏ మూలకైనా సరకు చేరవేయగల భారీ నెట్‌వర్క్‌.. రాజకీయ, పోలీసు యంత్రాంగాలతో పైరవీలు.. వారాంతంలో ప్రత్యేకంగా థీమ్‌ పార్టీలతో హంగామా.. వెరసి గోవా డ్రగ్‌ సూత్రధారి ఎడ్విన్‌ న్యూన్స్‌(45) ఏకంగా చీకటి సామ్రాజ్యాన్నే సృష్టించాడు.

Updated : 22 Nov 2022 15:19 IST

డ్రగ్‌ స్మగ్లర్‌ ఎడ్విన్‌కు భారీ నెట్‌వర్క్‌

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిచయాలు. ఏ మూలకైనా సరకు చేరవేయగల భారీ నెట్‌వర్క్‌.. రాజకీయ, పోలీసు యంత్రాంగాలతో పైరవీలు.. వారాంతంలో ప్రత్యేకంగా థీమ్‌ పార్టీలతో హంగామా.. వెరసి గోవా డ్రగ్‌ సూత్రధారి ఎడ్విన్‌ న్యూన్స్‌(45) ఏకంగా చీకటి సామ్రాజ్యాన్నే సృష్టించాడు. రేయింబవళ్లు విందు, వినోదాలతో కుర్రకారును మత్తులో ముంచేస్తున్నా కొందరు పోలీసులు చూసీచూడనట్టు వదిలేసేవారు. ఇతర రాష్ట్రాల పోలీసులు దాడులకు వెళ్లినప్పుడు అతగాణ్ని ముందుగానే అప్రమత్తం చేసేవారు. అంతటి కరడుగట్టిన ఎడ్విన్‌ను అరెస్ట్‌ చేసేందుకు హైదరాబాద్‌ నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌(హెచ్‌.న్యూ) పోలీసులు 3 నెలలు తీవ్రంగా శ్రమించారు. గోవాలోనే మకాం వేసి ముమ్మరంగా గాలించారు. ఎడ్విన్‌ను గురువారం హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారు. ఇంతకాలం పోలీసుల కంటబడకుండా అతడు ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు.

సర్వర్‌ నుంచి స్మగ్లర్‌గా..

ఎడ్విన్‌.. హోటల్‌ సర్వర్‌గా జీవితం ప్రారంభించి డ్రగ్‌ స్మగ్లర్‌గా ఎదిగాడు. హోటల్‌కు వచ్చే విదేశీయులతో పరిచయాలు పెంచుకొని మత్తుపదార్థాలు విక్రయిస్తూ కొద్దిసమయంలోనే వ్యాపారిగా మారాడు. పోలీసు, రాజకీయ నాయకుల సన్నిహిత సంబంధాలతో చెలరేగాడు. తనవైపు కన్నెత్తి చూడకుండా డబ్బుతో నోళ్లు నొక్కేశాడు. రూ.కోట్లు కూడబెట్టి గోవా, ముంబయిల్లో మామ సెబాస్టియన్‌ సహకారంతో పెద్దఎత్తున ఆస్తులు కొన్నాడు. సినీ పరిశ్రమలో ఎంతోమందికి ఆర్థిక సహకారం అందిస్తుంటాడు. ప్రత్యేక సందర్భాల్లో పబ్‌లలో వేడుకలకు సినీతారలను ఆహ్వానించేవాడని సమాచారం. హెచ్‌.న్యూ పోలీసులు తనను వెతుకుతున్నట్టు తెలియగానే బయటపడేందుకు ఎడ్విన్‌ చాలా ప్రయత్నాలు చేశాడు. సోనాలీ ఫోగాట్‌ అనుమానాస్పద మృతి కేసులో బెయిల్‌పై బయటకొచ్చి అజ్ఞాతంలోకి వెళ్లాడు. నగర పోలీసుల అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు కొవిడ్‌ నకిలీ సర్టిఫికెట్‌ సృష్టించాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి చేరాడు. ‘నేను గోవా డాన్‌.. నన్నెవ్వరూ తాకలేర’నే ధీమాగా ఉండే ఈ కింగ్‌పిన్‌ తన రక్షణకు నలుగురు వ్యక్తులను నియమించుకున్నాడు. ఒకేచోట ఉంటే పట్టుబడతాననే భయంతో ఫామ్‌హౌస్‌, ధాబా, అద్దె ఇళ్లు, బీచ్‌లు ఇలా 20-25 ప్రాంతాలకు మకాం మార్చాడు. ముందస్తు బెయిల్‌ కోసం ఏకంగా 10 మంది న్యాయనిపుణులను ఏర్పాటు చేసుకుని, 3 నెలల్లో రూ.2.5కోట్ల వరకూ ఖర్చు చేసినట్టు సమాచారం. డ్రగ్స్‌ సరఫరాలో ఇతడికి 50,000 మంది కొనుగోలుదారులు.. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు 2,000 మంది వరకూ ఉండొచ్చని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఎడ్విన్‌ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 5 రోజుల కస్టడీ కోరుతూ సోమవారం పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని