Andhra News: నిశ్చితార్థం ఉందన్నా వదిలిపెట్టలేదు.. రూ.3 లక్షలు డిమాండ్‌ చేసిన సీఐ, ఎస్‌ఐ

ఓ కేసు విషయమై తమిళనాడు వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు వ్యాపారులను తీసుకొచ్చి, వదిలిపెట్టాలంటే రూ.3 లక్షలివ్వాలంటూ ఓ సీఐ, ఎస్‌ఐ డిమాండ్‌ చేసిన ఉదంతమిది...

Updated : 08 Nov 2022 09:45 IST

చిత్తూరు పోలీసుల నిర్వాకం

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: ఓ కేసు విషయమై తమిళనాడు వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు వ్యాపారులను తీసుకొచ్చి, వదిలిపెట్టాలంటే రూ.3 లక్షలివ్వాలంటూ ఓ సీఐ, ఎస్‌ఐ డిమాండ్‌ చేసిన ఉదంతమిది... చిత్తూరులో గత నెలలో ఓ చోరీ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దొంగిలించిన బంగారాన్ని తమిళనాడు అరక్కోణంలో కుదువ పెట్టినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. అక్టోబరు 7న నగల రికవరీ కోసం సీఐ, ఎస్‌ఐ అరక్కోణం వెళ్లారు.

బంగారం స్వాధీనం చేసుకుని, ముగ్గురు కుదవ వ్యాపారులను అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తీసుకొచ్చారు. రెండు రోజుల్లో తన కుమారుడి నిశ్చితార్థం ఉందని ఓ వ్యాపారి ఎంత మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. స్టేషన్‌ నుంచి విడిపించాలంటే రూ.3 లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరులోని ఓ వ్యాపారి సహాయంతో రూ.లక్ష ఇచ్చి అక్టోబరు 8న రాత్రి 11.30 గంటలకు బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న తమిళనాడు పాన్‌ బ్రోకర్స్‌ అండ్‌ జ్యుయెలర్స్‌ అసోసియేషన్‌ నాయకులు గత నెల 24న ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.

వైకాపా ప్రజాప్రతినిధి ఒకరు, చిత్తూరు జిల్లాకు చెందిన కీలక మంత్రి ఒకరు... విచారణ వద్దంటూ ఎస్పీపై ఒత్తిళ్లు తెచ్చారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా ఏఎస్పీతో విచారణ చేయించగా అన్నీ వాస్తవాలేనని తేలింది. విషయం పెద్దది కావడంతో... కేసును ఉపసంహరించుకోవాలంటూ వ్యాపారులపై సీఐ ఒత్తిడి తెచ్చారు. వారి నుంచి తీసుకున్న రూ.లక్షను వెనక్కి ఇచ్చారు. ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నట్లు వ్యాపారులు వినతిపత్రం ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఎస్పీ రిషాంత్‌రెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. వ్యాపారులు ఫిర్యాదు ఇచ్చింది వాస్తవమేనని, ఆ తర్వాత వారు ఉపసంహరించుకుంటూ అర్జీ ఇచ్చినప్పటికీ... నిబంధనలు పాటించనందున సీఐ, ఎస్‌ఐలపై చర్యలకు సిఫార్సు చేశామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని