Andhra News: తెదేపా నేత అనుమానాస్పద మృతి

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన తెదేపా నేత సురేష్‌నాయుడు(40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం సృష్టించింది.

Published : 26 Nov 2022 08:28 IST

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లెలో ఘటన
వైకాపా వ్యక్తులే హత్య చేశారని పోలీసులకు కుటుంబీకుల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన తెదేపా నేత సురేష్‌నాయుడు(40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం సృష్టించింది. వైకాపా వ్యక్తులే ఈ హత్య చేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సురేష్‌ను కత్తితో తలపై నరికి చంపిన తర్వాత ఇంటి ఆవరణలోని నీటి తొట్టెలో పడేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. హత్యలో వైయస్‌ఆర్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి పాత్ర ఉందని వారు చెబుతున్నారు. సురేష్‌నాయుడికి వివాహమైనప్పటికీ భార్య పుట్టింట్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో సురేష్‌నాయుడు, తల్లి నిర్మాలాదేవి మాత్రమే ఉంటున్నారు. తల్లి గురువారం వేరే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి హత్య చేసి ఉంటారని మృతుడి తల్లి ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం తొట్టిలో మృతదేహాన్ని బంధువులు గుర్తించారు.

భూమి కోసమే హత్య?

మన్నూరు వద్ద సురేష్‌నాయుడికి ఆరెకరాల పొలం ఉంది. దాన్ని తమకు విక్రయించాలని జడ్పీ ఛైర్మన్‌ సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి ఒత్తిడి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సురేష్‌ పొలం పక్కనే అనిల్‌కుమార్‌రెడ్డి భూమి ఉండటంతో దానిపై కన్నేశారని వారు చెబుతున్నారు. అనిల్‌కుమార్‌రెడ్డికి కాదని.. పది రోజుల కింద తెదేపాకు చెందిన సుబ్బనర్సయ్యకు ఆ భూమిని విక్రయించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకులు తన కుమారుడిని చంపారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతుని తల్లి పేర్కొన్నారు. ఫిర్యాదులో వైకాపాకు చెందిన లేబాకు నాగేంద్రపై అనుమానాలున్నట్లు వివరించారు. ఫోర్జరీ పత్రాల ఆధారంగా సురేష్‌నాయుడి ఆస్తిని కాజేసే ప్రయత్నం జరిగిందని, ఈ విషయమై న్యాయస్థానంలో కేసు సైతం నడుస్తున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రానికి అనుమానితుల పేర్లను పేర్కొంటూ మృతుని తల్లి నిర్మలాదేవి పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తులో అన్ని విషయాలు తేలతాయని మన్నూరు ఎస్‌.ఐ భక్తవత్సలం తెలిపారు. హత్య జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేయడంపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహంపై కత్తిపోట్లు కనిపిస్తున్నాయని, నాలుగు అడుగుల తొట్టెలో పడి ఆరడుగుల వ్యక్తి చనిపోయాడనే అనుమానం వ్యక్తం చేయడం ఎంత వరకు సబబు అని పోలీసులను ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని