సంక్షిప్త వార్తలు (3)

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. పిక్నిక్‌కు వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. జూలో ఉన్న టాయ్‌ ట్రైన్‌ కింద పడి ప్రాణాలు కోల్పోయింది.

Updated : 27 Nov 2022 06:12 IST

జూలో ‘టాయ్‌ ట్రైన్‌’ కింద పడి మహిళ మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. పిక్నిక్‌కు వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. జూలో ఉన్న టాయ్‌ ట్రైన్‌ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కాన్పుర్‌లో జరిగింది. ఉపాధ్యాయురాలు అంజు శర్మ.. శనివారం తన కుమార్తెతో కలిసి కాన్పుర్‌లోని జూకు వచ్చింది. అనంతరం తన కుమార్తెను అక్కడే ఉన్న టాయ్‌ ట్రైన్‌ను ఎక్కించింది. ఆమె కూడా ఎక్కడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే చీర రైలు చక్రాల్లో చిక్కుకుని కిందపడిపోయింది. రైలు ఆమె పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అంజు శర్మ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


రుణం ఎగ్గొట్టేందుకు భార్య హత్య..

తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే అవసరం ఉండదన్న ఉద్దేశంతో భార్యనే కిరాతకంగా హత్య చేశాడో భర్త. ఈ ఘటన బిహార్‌లోని సహస్ర జిల్లాలో జరిగింది. పత్‌బిందా గ్రామానికి చెందిన ములాయం యాదవ్‌, లక్ష్మీదేవిని 8 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే.. డబ్బుల కోసం ములాయం తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో లక్ష్మీదేవి తన తల్లిని డబ్బులు సమకూర్చాల్సిందిగా అడిగింది. అనంతరం లక్ష్మీదేవి పేరుమీద తన తల్లి బ్యాంకులో రుణం ఇప్పించింది. ఆ రుణం విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భార్య చనిపోతే లోన్‌ తిరిగి చెల్లించే అవసరం ఉండదని.. భావించాడు ములాయం. ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు. చివరకు నిందితుడిని అరెస్టు చేశారు.


నలుగురి ప్రాణం తీసిన ‘సెల్ఫీ’

బెళగావి, న్యూస్‌టుడే: సెల్ఫీ ప్రాణాల మీదకు తెచ్చిన ఉదంతమిది. కర్ణాటకలోని బెళగావి, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 40 మంది యువతులు శనివారం ఉదయం మహారాష్ట్ర సరిహద్దులోని కితవాడ జలపాతం దగ్గరకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అందరూ సెల్‌ఫోన్‌లతో ఫొటోలు తీసుకుంటున్నారు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఐదుగురు యువతులు నీటిలో పడిపోయారు. నలుగురు ప్రాణాలు కోల్పోగా స్నేహితులు ఓ యువతిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని