ముక్కలు ముక్కలుగా శరీరం

ఇటీవల వెలుగు చూసిన శ్రద్ధా వాకర్‌ దారుణ హత్య కేసును తలపించేలా ఓ వ్యక్తిని అతని భార్య, కుమారుడు దారుణాతిదారుణంగా హతమార్చిన ఘటన దిల్లీలో బయటపడటం సంచలనం సృష్టించింది.

Published : 29 Nov 2022 06:43 IST

ప్లాస్టిక్‌ సంచుల్లో భాగాలు
భార్య, సవతి కుమారుడే నిందితులు
సవతి కుమార్తెలు, కోడలిపై కన్నేసినందుకే హత్య

దిల్లీ: ఇటీవల వెలుగు చూసిన శ్రద్ధా వాకర్‌ దారుణ హత్య కేసును తలపించేలా ఓ వ్యక్తిని అతని భార్య, కుమారుడు దారుణాతిదారుణంగా హతమార్చిన ఘటన దిల్లీలో బయటపడటం సంచలనం సృష్టించింది. అంజన్‌ దాస్‌ (45)ను మే 30న హతమార్చిన అతని భార్య పూనమ్‌ (48), సవతి కుమారుడు దీపక్‌ (25)లను పాండవ్‌ నగర్‌లో అరెస్టు చేసిన పోలీసులు హత్య జరగడానికి కారణాలు, తీరును వెల్లడించారు.

నగలు అమ్మేసి నగదు మొదటి భార్యకు

అంజన్‌ దాస్‌కు మొదటి భార్య ద్వారా ఎనిమిది మంది సంతానం. ఏవో కారణాలతో ఆమె భర్తను విడిచిపెట్టి తన పిల్లలను తీసుకుని దిల్లీ నుంచి బిహార్‌ వెళ్లిపోయింది. ఈ క్రమంలో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అంజన్‌ దాస్‌కు పూనమ్‌ పరిచయమైంది. ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడింది. అప్పటికి ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే 2016లో ఆ వ్యక్తి కాలేయం పాడై మరణించాడు. దీంతో 2017లో పూనమ్‌.. దాస్‌ను వివాహం చేసుకుంది. ఆ సమయానికి అతనికి ఇంతకు ముందే పెళ్లైన విషయం ఆమెకు తెలియదు. పూనమ్‌కు మొదటి భర్త ద్వారా కుమారుడు దీపక్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరంతా తూర్పు దిల్లీలోని పాండవ్‌ నగర్‌ త్రిలోక్‌పురి ప్రాంతంలో గల దాస్‌ ఇంట్లోనే ఉండేవారు. ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ మద్యానికి డబ్బులివ్వాలంటూ భార్యను, ఆమె కుమారుడు దీపక్‌ను దాస్‌ వేధించేవాడు. ఇటీవలే దీపక్‌కు వివాహం జరిగింది. అతని భార్యతో సహా పూనమ్‌ కుమార్తెలను దాస్‌ లైంగికంగా వేధించడం ప్రారôభించాడు. ఈ విషయాన్ని వారు పూనమ్‌, దీపక్‌లకు వివరించారు. ఇదిలా ఉండగా ఓ రోజు దాస్‌.. పూనమ్‌ నగలను అమ్మేశాడు. ఆ డబ్బును మొదటి భార్యకు పంపించాడు. దీంతో విసిగివేసారిపోయిన పూనమ్‌ కుమారుడికి తన బాధను వివరించింది. చివరకు వారిద్దరూ అంజన్‌ దాస్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.

ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని

తల్లీకుమారులు మద్యంలో మత్తుమందు కలిపి మే 30న రాత్రి దాస్‌తో తాగించారు. అచేతనంగా మారిన సమయంలో అతన్ని దీపక్‌ గొంతుకోసి హతమార్చాడు. శరీరం నుంచి రక్తం అంతా డ్రైనేజీ నుంచి బయటకు పోయేలా రాత్రంతా శవాన్ని ఇంట్లో అలాగే ఉంచారు. చివరకు ఆ మృతదేహాన్ని 10 ముక్కలు చేసి, ప్లాస్టిక్‌ సంచుల్లో పెట్టి ఫ్రిజ్‌లో దాచారు. కొన్ని రోజుల తర్వాత ఆ సంచులను దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశారు. దుర్వాసన రాకుండా ఫ్రిజ్‌ను, ఇంటిని బాగా శుభ్రం చేశారు. అంజన్‌ దాస్‌ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చుట్టుపక్కల వాళ్లకి చెప్పారు.

జూన్‌ 5వ తేదీన రామ్‌లీలా మైదానం వద్ద కొన్ని శరీరభాగాలను పోలీసులు గుర్తించారు. ఆపై మరికొన్ని రోజులకు కాళ్లు, తొడలు, మోచేయిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల శ్రద్ధా వాకర్‌ హత్య బయటపడటం.. ఆమె శరీరభాగాల కోసం గాలిస్తుంటే దొరికిన తలను శ్రద్ధాదిగా భావించినా చివరకు దానిని అంజన్‌ దాస్‌దిగా గుర్తించారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు పాండవనగర్‌లో ఇంటింటి దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో అంజన్‌ దాస్‌ కనిపించకుండా పోయి అయిదు నెలలు గడుస్తున్నా ఫిర్యాదు చేయలేదన్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వారు సీసీటీవీ దృశ్యాలను గమనించారు. అందులో దీపక్‌, పూనమ్‌లు సంచులతో కనిపించారు. ఆ ఆధారంతో పూనమ్‌ కుటుంబాన్ని పోలీసులు గట్టిగా నిలదీయడంతో దాస్‌తో వేగలేక తామే ఈ హత్యకు పాల్పడినట్లు పూనమ్‌, దీపక్‌లు అంగీకరించారు. దాస్‌ కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించేందుకు ఓ పోలీసు బృందం బిహార్‌కు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని