ఆఫ్తాబ్‌ పూనావాలాకు నార్కో పరీక్ష పూర్తి

సంచలనాత్మక శ్రద్ధావాకర్‌ హత్య కేసు విచారణలో భాగంగా నిందితుడు ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాకు గురువారం దిల్లీలోని రోహిణీలోని ఒక ఆసుపత్రిలో రెండు గంటలపాటు నార్కో పరీక్ష నిర్వహించారు.

Updated : 02 Dec 2022 07:01 IST

శ్రద్ధాను చంపి, రంపంతో ముక్కలు చేసినట్లు వెల్లడి!
రెండు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు

దిల్లీ: సంచలనాత్మక శ్రద్ధావాకర్‌ హత్య కేసు విచారణలో భాగంగా నిందితుడు ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాకు గురువారం దిల్లీలోని రోహిణీలోని ఒక ఆసుపత్రిలో రెండు గంటలపాటు నార్కో పరీక్ష నిర్వహించారు. సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్‌ను గొంతు నులిమి చంపేశాననీ, మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోశాననీ దీనిలో అంగీకరించినట్లు సమాచారం. ఆమె ఫోనునూ విసిరేసినట్లు చెప్పినా అది ఎక్కడ అనేది వెల్లడించలేదు. పరీక్ష విజయవంతమైందని, ఉన్నతాధికారులు వెల్లడించారు. నార్కో పరీక్షకు ముందు వైద్యులు సాధారణ పరీక్షలు నిర్వహించి, చేపట్టబోయే ప్రక్రియ గురించి పూర్తి వివరాలు తెలిపారు.  ప్రక్రియ పూర్తయ్యాక ఆఫ్తాబ్‌ను కొంతసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ పరీక్షను నిర్వహించేటప్పుడు సోడియం పెంటథాల్‌ వంటి ఔషధాన్ని నిందితుడికి ఐ.వి. విధానంలో ఇచ్చి, పాక్షికంగా మత్తు కలిగిస్తారు. పూర్తి స్పృహలో ఉన్నప్పుడు వెల్లడించని సమాచారాన్నీ ఈ స్థితిలో చెప్పేందుకు వీలుంటుంది. విచారణలో, పాలిగ్రాఫ్‌ పరీక్షలో ఆఫ్తాబ్‌ తన నేరాన్ని అంగీకరించినా అవి చట్టబద్ధంగా చెల్లకపోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంపైనా వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని భౌతికంగా కోర్టులో హాజరుపరాలని దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.సొంధి చెప్పారు. నార్కో అనాలిసిస్‌, పాలిగ్రాఫ్‌ పరీక్షలు వ్యర్థమనీ, వీటికి చట్టబద్ధత లేనందువల్ల సమయం వృథా తప్ప, ఉపయోగం ఉండదని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని