గిరిజన బాలికలపై హెచ్‌ఎం భర్త లైంగిక వేధింపులు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని భర్త ప్రసాద్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరేలకు మంగళవారం ఫిర్యాదుచేశారు.

Updated : 07 Dec 2022 06:13 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని భర్త ప్రసాద్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరేలకు మంగళవారం ఫిర్యాదుచేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న క్వార్టర్‌లోనే ఆమె తన భర్తతో కలిసి ఉంటున్నారు. కొన్ని రోజులుగా తాము స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు వేసుకునేటప్పుడు ఆయన చూస్తున్నారని, ప్రశ్నిస్తే కొడుతున్నారని, చాలీచాలని భోజనం పెడుతున్నారని విద్యార్థినులు వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వీరు సర్పంచి కొమరం పండుదొరకు వివరించగా.. ఆయన ఐటీడీఏ పీవో గనోరేకు, ఎమ్మెల్యే ధనలక్ష్మికి మంగళవారం ఫిర్యాదుచేశారు. పీవో వెంటనే పాఠశాలను సందర్శించి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ధనలక్ష్మి పాఠశాలకు వచ్చి తొలుత పిల్లలతో మాట్లాడారు. రికార్డులను పరిశీలించి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్‌ఎం భర్తపై కేసు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మరో హెచ్‌ఎంను నియమించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని గుర్తించామన్నారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన బియ్యం, గుడ్లు, పాల ప్యాకెట్ల కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బందం శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి, సర్పంచి పండుదొర, ఏటీడబ్ల్యూవో రామతులసి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని