Andhra News: నడిరోడ్డుపై రాళ్లకుప్పను ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

రహదారి పనులు చేసే చోట సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువ ఇంజినీర్‌ ప్రాణాలను బలిగొంది.

Updated : 13 Dec 2022 07:27 IST

రహదారి పనుల వద్ద సూచికల్లేని ఫలితం

కరాస (విశాఖపట్నం), న్యూస్‌టుడే: రహదారి పనులు చేసే చోట సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువ ఇంజినీర్‌ ప్రాణాలను బలిగొంది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం.. విశాఖ నగరంలోని 52వ వార్డు మర్రిపాలెం వుడా లేఅవుట్‌ శ్రీవత్స ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న సింగంపల్లి మురళీకృష్ణ (36) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల వేళ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. ఆ దారిలో ప్రాంతీయ నేర పరిశోధన కేంద్రం వద్ద కొద్దిరోజులుగా రోడ్డు పనులు జరుగుతున్నాయి.

జీవీఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్‌ చుట్టూ సిమెంట్‌తో ప్లాస్టింగ్‌ చేసి, దానిపైకి వాహనాలు రాకుండా చుట్టూ కొన్ని రాళ్లు కుప్పగా పోశారు. శని, ఆదివారాల్లో పనులు చేయకపోవడం వల్ల అవి అలాగే ఉండిపోయాయి. అక్కడ ఎలాంటి సూచికలు పెట్టలేదు. మురళీకృష్ణ ఆ రాళ్ల కుప్పను ఢీకొని అదుపుతప్పి పడిపోగా తలకు తీవ్రగాయమైంది. పోలీసుల నుంచి ఫోన్‌ రావడంతో మురళీ భార్య రోహిణి తన సోదరుడితో కలిసి ఘటనాస్థలికి వెళ్లారు. సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మురళీకృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహన్ని కేజీహెచ్‌కు తరలించారు. మ్యాన్‌హోల్‌పైఉన్న రాళ్ల కారణంగానే తన భర్త చనిపోయాడని రోహిణి కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ ప్రమాదం జరిగాక మ్యాన్‌హోల్‌ చుట్టూ శుభ్రంచేసి ప్రమాదానికి కారణాలు, ఆనవాళ్లు లేకుండా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని