Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రెచ్చిపోయిన రౌడీ మూకలు

విశాఖ జిల్లా పెందుర్తిలో రౌడీ మూకలు రెచ్చిపోయాయి. సుమారు 100 మంది రౌడీల సాయంతో మంగళవారం అర్ధరాత్రి స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నించారు.

Updated : 31 May 2023 16:04 IST

వేపగుంట: విశాఖ జిల్లా పెందుర్తిలో రౌడీ మూకలు రెచ్చిపోయాయి. సుమారు 100 మంది రౌడీల సాయంతో మంగళవారం అర్ధరాత్రి స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. పెందుర్తి మండల పరిధిలోని సర్వే నంబర్ 164/1 వేపగుంట షిప్ యార్డ్ లేఅవుట్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో కొంతమంది కిరాయి రౌడీ మూకలు  రేకుల షెడ్డును దౌర్జన్యంగా తొలగించారు. ఆ సమయంలో రేకుల షెడ్డులో మహిళా వాచ్‌మెన్‌ నిద్రిస్తోంది. తలుపు పగలగొట్టి దౌర్జన్యంగా మహిళా వాచ్‌మెన్‌ను బయటికి తీసుకువెళ్లారు. భయంతో ఆమె స్థల యజమానికి ఫోన్ చేయాలని ప్రయత్నించగా.. రౌడీ మూకలు ఫోన్ లాక్కున్నారు. యజమానికి ఫోన్ చేస్తే చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. దీంతో సమీపంలో ఉన్న మరో వ్యక్తి ద్వారా ఆమె డయల్‌ 100కి ఫోన్‌ చేశారు.

సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడం చూసిన రౌడీలు అక్కడి నుంచి పారిపోయారు. అలా పారిపోతుండగా వారిలో ఇద్దరు రౌడీలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న భూమి యజమాని (న్యాయస్థానంలో పోరాడుతున్న వ్యక్తి) మహేష్ తన స్థలం వద్దకు చేరుకొని మీడియాతో మాట్లాడారు. ‘‘కొంతమంది రౌడీ మూకలు అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేశారు. మహిళా వాచ్‌మెన్‌ను భయభ్రాంతులకు గురిచేశారు. స్థానికంగా ఉంటున్న అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యే అనుచరులే ఈవిధంగా దౌర్జన్యం చేశారు. 2010 నుంచి సివిల్ కోర్టులో స్థల వివాదానికి సంబంధించిన కేసు నడుస్తోంది. ఏడాది క్రితం కొంతమంది రౌడీలు వచ్చి ఇలానే దౌర్జన్యం చేశారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. సంవత్సరం తర్వాత ఇప్పుడు మరోసారి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? తక్షణమే పోలీసులు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని మహేశ్‌ కోరారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు