Crime News: రమ్య హత్యకేసులో నిందితుడు అరెస్ట్‌: డీజీపీ

బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈరోజు జరిగిన రమ్య హత్య ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం..

Updated : 16 Aug 2021 07:31 IST

గుంటూరు: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈరోజు జరిగిన రమ్య హత్య ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు చెప్పారు. ఈకేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని డీజీపీ తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితుడిని గుంటూరు అర్బన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. సోషల్‌ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. యువతులు, మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్‌ పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు. మహిళల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని, ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.

ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు

బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని నరసరావుపేటలోని పమిడిపాడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులను గమనించిన బ్లేడుతో చేతులు   కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. 

రూ.10 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం

బీటెక్‌ విద్యార్థిని రమ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యువతి హత్య ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘దిశ’ చట్టం ప్రకారం వేగంగా చర్యలు తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని.. పరిహారంగా రూ.10 లక్షలు అందించాలని సీఎం ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని