ముకేశ్‌ ఇంటివద్ద వాహనం: కీలక ఆధారాలు లభ్యం!

మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మన్‌సుఖ్‌ మృతదేహం లభ్యమైన మితి నదిలో మరిన్ని కీలక ఆధారాలను కేంద్ర దర్యాప్తు బృందం సేకరించింది.

Updated : 29 Mar 2021 04:18 IST

ముంబయి: మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మన్‌సుఖ్‌ మృతదేహం లభ్యమైన మితి నదిలో కీలక ఆధారాలను కేంద్ర దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) సేకరించింది. దర్యాప్తులో భాగంగా, ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సచిన్‌ వాజే ఇచ్చిన సమాచారంతో ఎన్‌ఐఏ అధికారులు మితి నదిలో గాలింపు చేపట్టగా.. కంప్యూటర్‌తో పాటు వాహన నంబర్‌ ప్లేట్‌ లభ్యమయ్యాయి.

ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద లభించిన స్కార్పియో వాహనం యజమానిగా భావిస్తోన్న మన్‌సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. వాహనానికి సంబంధించిన కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతుండగా, అందులో కీలక సూత్రధారిగా ఉన్న సచిన్ వాజేను విచారిస్తోంది. చివరకు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టిన ఎన్‌ఐఏ అధికారులు, సచిన్‌ వాజేను మితి నది వద్దకు తీసుకెళ్లారు. సచిన్‌ వాజే ఇచ్చిన సమాచారంతో మన్‌సుఖ్‌ మృతదేహం దొరికిన చోట గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా.. కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌, వాహన నంబర్‌ ప్లేట్‌లు లభ్యమయ్యాయి.

ఇదిలాఉంటే, వాహనంలో పేలుడు పదార్థాలు లభించిన కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుండగా, మన్‌సుఖ్‌ మృతి కేసును మాత్రం ముంబయి ఏటీఎస్‌ దర్యాప్తు జరుపుతోంది. సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేనే మన్‌సుఖ్‌ మృతికేసులో కీలక సూత్రధారి అని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్‌) పేర్కొంది. ఈ కేసులో సచిన్‌ వాజే కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయని ఏటీఎస్‌ వెల్లడించింది. తాజాగా ఎన్‌ఐఏ దర్యాప్తులోనూ మున్‌సుఖ్‌ మృతదేహం లభ్యమైన చోటే హార్డ్‌డిస్క్‌, వాహన నంబర్‌ ప్లేట్‌ లభ్యమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు