shraddha walker: ఆఫ్తాబ్‌ క్రూరత్వానికి హద్దేలేదు..!

శ్రద్ధా వాకర్‌ హత్యకేసులో పోలీసుల చేతికి మరిన్ని ఆధారాలు దొరికాయి. వీటితోపాటు విస్తుపోయే పలు విషయాలు వెల్లడవుతున్నాయి.

Updated : 25 Nov 2022 12:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రద్ధావాకర్‌ హత్యకేసుకు సంబంధించి ఆఫ్తాబ్‌కు తాజాగా నిర్వహించిన పాలీగ్రాఫ్‌ పరీక్ష ద్వారా పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. దిల్లీలోని రోహిణీలో ఉన్న ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీని ఇందుకు వినియోగించారు. నిన్న ఉదయం 12 గంటల సమయంలో ఈ పరీక్ష మొదలుపెట్టారు. పోలీసులు హిందీలో ప్రశ్నలు అడగ్గా.. అతడు ఇంగ్లిష్‌లో సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో శ్రద్ధాతో సంబంధం, ఆమె హత్యకు దారితీసిన పరిణామాలు, నేరం ఎప్పుడు జరిగింది, శరీర భాగాలను ఎక్కడెక్కడ పారేశాడు .. వంటి వివరాలను అడిగారు. నేడు కూడా అతడికి పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి సుమారు 8 గంటలపాటు జరగనున్నాయి.

మరోవైపు నిన్న సూరజ్‌కుండ్‌ అడవుల్లో సూట్‌కేస్‌లో శరీర భాగాలు దొరికాయి. వీటిని దిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ భాగాలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపనున్నారు.

ఐదు కత్తులు.. మూడు సీసీ కెమెరాలు స్వాధీనం..

ఆఫ్తాబ్‌ ఇంటి నుంచి దాదాపు ఆరు అంగుళాల పొడవున్న ఐదు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీకి పంపించారు. దీంతోపాటు ఆఫ్తాబ్‌ ఛత్రపూర్‌ ప్రాంతంలో తిరుగుతున్న దృశ్యాలు నమోదైన మూడు సీసీటీవీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిల్లో వందల గంటల కొద్దీ ఉన్న రికార్డులను విశ్లేషించే బాధ్యతను ఓ బృందానికి అప్పగించారు. దాదాపు 150కు పైగా సీసీ కెమెరాలను విశ్లేషించిన తర్వాత ఆఫ్తాబ్‌ కదలికలను గుర్తించారు.  

శ్రద్ధాను సిగరెట్‌తో కాల్చేవాడు..

ఆఫ్తాబ్‌-శ్రద్ధాలు కలిసి ఉన్న సమయంలో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. వారు కలిసి ఉన్న రోజుల్లో ఆఫ్తాబ్‌ ఆమె వీపుపై సిగరెట్‌తో కాల్చేవాడని తేలిసింది. ఈ విషయాన్ని శ్రద్ధా మిత్రులు నిన్న వెల్లడించారు. ఆఫ్తాబ్‌తో కలిసి ఉండాలని భావించిన శ్రద్ధా అతడిని భరించినట్లు పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్‌ ఆధారాల్లేకుండా పక్కా ప్లానింగ్‌..

ఆఫ్తాబ్‌ పక్కా ప్లానింగ్‌ చేసుకున్నాడని దిల్లీ పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. తాము అతడిని విచారించిన 12 రోజుల్లో ఈ విషయం స్పష్టంగా తెలిసిందన్నారు. శ్రద్ధా శరీర భాగాలను పారేసే సమయంలో ఎటువంటి ఎలక్ట్రానిక్‌ ఆధారాలు భవిష్యత్తులో పోలీసులకు చిక్కకుండా ముందు జాగ్రత్తలు తీసుకొన్నాడని వెల్లడించారు. ఆ సమయంలో తన వెంట ఫోన్‌ను తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచేవాడని పేర్కొన్నారు. పోలీసులు వాటిని విశ్లేషించినా.. సిగ్నల్స్‌ లొకేషన్‌ ఇంట్లోనే చూపించేట్లు జాగ్రత్తలు తీసుకొన్నాడని తెలిపారు.  

ముందుగా ప్లాన్‌ చేసి.. ఛత్రపూర్‌లో అద్దెకు దిగి..

ఆఫ్తాబ్‌ దిల్లీలోని ఛత్రపూర్‌ ప్రాంతంలో కూడా ముందుగానే ప్లాన్‌ చేసి ఇల్లు తీసుకొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆఫ్తాబ్‌-శ్రద్ధాలు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నప్పుడు బద్రీ అనే వ్యక్తి పరిచయం కాగా.. అతడి సాయంతోనే ఛత్రపూర్‌ ప్రాంతానికి ఆఫ్తాబ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రదేశానికి సమీపంలోనే  అడవులు ఉన్నట్లు గ్రహించిన ఆఫ్తాబ్‌ ఛత్రపూర్‌లో ఇల్లు తీసుకొన్నట్లు భావిస్తున్నారు. 

క్షణికావేశంలో ఆ ఘటన (శ్రద్ధా హత్య) జరిగినట్లు న్యాయస్థానం ఎదుట ఆఫ్తాబ్‌ చెప్పాడు. కానీ, రెండేళ్ల క్రితం శ్రద్ధా అతడిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తనను ముక్కలుగా నరికి చంపుతాడని పేర్కొంది. చివరికి ఆఫ్తాబ్‌ అలాగే ఆమెను హత్య చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని