Delhi: సాక్షి హంతకుడిని పట్టించిన ఫోన్‌కాల్‌..!

దిల్లీలో సాక్షి అనే బాలిక హత్యలో హంతకుడిని ఓ ఫోన్‌కాల్‌ పట్టించింది. ఈ కేసులో విచారణ జరిగేకొద్దీ పలు విషయాలు బయటపడుతున్నాయి.

Published : 30 May 2023 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలో స్నేహితురాలిని నడిరోడ్డుపై 20సార్లు పొడిచి చంపిన కేసు(Delhi)లో హంతకుడు సాహిల్‌ను ఓ ఫోన్‌కాల్‌ పట్టించింది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. సాక్షి(16)ని హత్య చేసిన వెంటనే సాహిల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు అతడు బులంద్‌షహర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇందు కోసం బస్సులో ప్రయాణించాడు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్‌ చేశాడు. కానీ, పోలీసులు వెంటనే అతడి కాల్‌ ఆధారంగా లొకేషన్‌ను గుర్తించారు.

ఇక సాక్షి పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం ఆమె పుర్రె భాగం పూర్తిగా పగిలిపోయినట్లు తేలింది. హంతకుడు తొలుత ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం నిర్జీవంగా పడి ఉన్న ఆమె శరీరాన్ని ఒక సిమెంట్‌ దిమ్మతో పదేపదే కొట్టాడు. మృతురాలికి అతడితో మూడేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆమె అతడి నుంచి విడిపోవాలనుకుంది. ఇదే విషయంలో వీరి మధ్య శనివారం గొడవ చోటు చేసుకొంది. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు సమాచారం. మృతురాలి చేతిపై ‘ప్రవీణ్‌’ పేరిట ఓ టాటూ ఎప్పటి నుంచో ఉంది. దానిపై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

మృతురాలు సాక్షి కుటుంబం జేజే కాలనీలో నివాసం ఉంటోంది. ఆమెకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. 15 రోజుల నుంచి సాక్షి తన స్నేహితురాలు నీతు ఇంట్లోనే ఉంటోంది. నీతు భర్త వేరే పనిపై దిల్లీ బయటకు వెళ్లడంతో ఆమెకు తోడుగా ఉంటోంది. శనివారం నీతు కుమార్తె బర్త్‌డే పార్టీ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ హత్య చోటు చేసుకొంది. 

హుక్కా.. మద్యం.. ఇవి సాహిల్‌ అలవాట్లు..

హంతకుడు సాహిల్‌కు మద్యం, హుక్కా అలవాట్లు ఉన్నట్లు అతడి సోషల్‌మీడియా ఖాతా ద్వారా గుర్తించారు. మిత్రులతో కలిసి హుక్కా తాగుతూ సిద్ధూమూసేవాల పంజాబీ పాటలు వింటున్న వీడియో ఒకటి అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. దీనిని ఆరు వారాల క్రితం పోస్టు చేశాడు. మూసేవాలా మరణించాక ‘రిప్‌ పాజీ’ అని సాహిల్‌ ఇన్‌స్టా స్టోరీ కూడా పోస్టు చేశాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని