భార్యను చంపి.. ఆపై పెట్రోల్‌ పోసి..

నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడడుగులు వేసి ఏడు జన్మలు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన ఓ భర్త.. తన భార్యను అతికిరాతకంగా కొట్టి

Published : 25 Apr 2021 02:00 IST

నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలో దారుణం

గూడూరు: నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడడుగులు వేసి ఏడు జన్మలు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన ఓ భర్త.. తన భార్యను అతికిరాతకంగా కొట్టి హతమార్చాడు. అంతటితో ఆగకుండా పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు పట్టణం దిగువ వీరారెడ్డిపల్లికి చెందిన శ్రీహరి, సుజాతలు భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా శ్రీహరి ఇంటికి రావడం లేదు. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బుతో పేకాట ఆడుతూ గడుపుతున్నాడు. విషయం తెలుసుకున్న సుజాత భర్తకు ఫోన్‌ చేయగా.. తోటలో ఉన్నానని.. ఇక్కడకు రావాలంటూ భార్యకు చెప్పాడు.

నిజమని నమ్మిన సుజాత తన సోదరులకు ఫోన్‌ చేసి తోట వద్దకు వెళ్తున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో తోటకు వెళ్లిన సుజాత శనివారం కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. తోటలో సగం కాలిన సుజాత మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్సైలు పుల్లారావు, ఆదిలక్ష్మీ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుజాత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీహరి పరారీలో ఉన్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని