Sattenapalle: ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత అనుమానంతో..

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రంగా కాలనీలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమె గొంతు నులిమి చంపేశాడు.

Updated : 07 Jun 2023 11:05 IST

సత్తెనపల్లి: అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను భర్తే హతమార్చిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం జరిగింది. సీఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఒంటిపులి కార్తీక్‌.. సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీకి చెందిన పల్లపు అరుణ(18)ను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న కార్తీక్‌.. ఆమెను తరచూ వేధిస్తున్నాడు. ఈనేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 10 రోజుల క్రితం భీమవరం నుంచి రంగా కాలనీకి వచ్చిన దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.  

ఈ క్రమంలో వారిద్దరి మధ్య మంగళవారం అర్ధరాత్రి మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో కార్తీక్‌.. అరుణ గొంతు నులిమి కిరాతంగా చంపేశాడు. అనంతరం అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని కార్తీక్‌ను సమీపంలోని ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ప్రస్తుతం కార్తీక్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని