Hyderabad: బైక్‌పై వెళ్లి 4 గ్రనేడ్లు తెచ్చిన జాహెద్‌.. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి

ఉగ్ర కుట్ర కేసు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. పేలుడు పదార్థాలను పాకిస్థాన్‌ నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్‌కు ఫరాతుల్లా ఘోరి పంపినట్టు గుర్తించారు.

Published : 04 Oct 2022 18:31 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడులకు పాకిస్థాన్‌లో పథక రచన చేసినట్లు గుర్తించారు. ఉగ్ర కుట్ర కేసు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. పేలుడు పదార్థాలను పాకిస్థాన్‌ నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్‌కు ఫరాతుల్లా ఘోరి పంపినట్టు గుర్తించారు. గత నెల 28న జాహెద్‌కు పేలుడు పదార్థాలు అందాయి. అతనే స్వయంగా బైక్‌పై వెళ్లి 4 గ్రనేడ్లు తీసుకొచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఒక గ్రనేడ్‌ తన వద్దే ఉంచుకుని, మూడింటిని సమీరుద్దీన్‌, మజ్‌హసన్‌లకు అందజేశాడు.

సమీరుద్దీన్‌ సెల్‌ఫోన్‌తో జాహెద్‌ ఫరాతుల్లా గౌరీతో చాట్‌ చేసినట్టు గుర్తించారు. 12 ఏళ్లు జైల్లో ఉండి తిరిగొచ్చిన తర్వాత పాక్‌లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు జాహెద్‌ పథకం రచించాడు. రూ.30లక్షలకు పైగా హవాలా ద్వారా నిందితులకు నగదు చేరిందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ డబ్బును జాహెద్‌ యువకులకు ఇచ్చి ఉగ్రవాదం వైపు ప్రేరేపించాడు. హైదరాబాద్‌లో జరిగే సామూహిక ఉత్సవాల్లో మజ్‌ హసన్‌, సమీయుద్దీన్‌, జాహెద్‌లు కలిసి ఒకేసారి దాడులు చేయాలని కుట్ర చేశారు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించి భయోత్పాతం సృష్టించడమే నిందితుల లక్ష్యమని పోలీసులు తెలిపారు. సామూహిక దాడులతో ప్రజల్లో అనిశ్చితి నెలకొల్పి, అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా దాడులకు స్కెచ్‌ వేశారు. భారీగా ప్రాణ నష్టం కలిగేలా చేయాలని నిందితుల ప్రణాళిక అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని