Crime: చెల్లిని చంపి.. యాసిడ్‌ పోసి.. ప్రియుడితో కలిసి 13 ఏళ్ల బాలిక ఘాతుకం!

తొమ్మిదేళ్ల చెల్లిని ఓ 13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. బిహార్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

Published : 25 May 2023 17:59 IST

పట్నా: బిహార్‌ (Bihar)లో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి ఓ 13 ఏళ్ల బాలిక తన తొమ్మిదేళ్ల సోదరిని హత్య (Murder) చేసింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని గుర్తుపట్టేందుకు వీలులేకుండా ముఖంపై యాసిడ్‌ పోసి కాల్చేసింది. దీంతోపాటు వేళ్లనూ నరికేసింది. తమ చిన్న కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితురాలు, ఆమె ప్రియుడితోపాటు ఈ ఘటనలో వారికి సహకరించిన ఓ బంధువురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

వైశాలీ జిల్లాకు చెందిన ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఓ వివాహ వేడుక కోసం తల్లిదండ్రులు ఇటీవల వేరే ఊరికి వెళ్లారు. నాలుగైదు రోజుల అనంతరం వారు ఇంటికి చేరుకోగా.. చిన్న కుమార్తె కనిపించడం లేదని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే వారి ఇంటి వెనుక బాలిక మృతదేహం లభ్యమైంది. కాల్‌ రికార్డింగ్‌, ఇతరత్రా సమాచారం ఆధారంగా.. మృతురాలి సోదరిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ నేరాన్ని తామే చేసినట్లు అంగీకరించింది.

‘బాలిక, ఆమె ప్రియుడు సన్నిహితంగా ఉండటాన్ని తొమ్మిదేళ్ల సోదరి చూసింది. దీంతో ఎక్కడ తమ విషయం ఇంట్లో చెబుతుందోనన్న భయంతో వారు ఆమెను అంతమొందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆమెపై దాడి చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే మూడు రోజులపాటు దాచిపెట్టారు. దుర్వాసన వస్తుండటంతో ఇంటి వెనుక ప్రాంతంలో వదిలేశారు. మృతదేహాన్ని గుర్తుపట్టరాకుండా ముఖంపై యాసిడ్‌ పోశారు. వేళ్లు నరికేశారు’ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులకు సహకరించిన 32 ఏళ్ల మహిళా బంధువును అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు