Crime News: మైనర్‌ ఘాతుకం.. 58 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై హత్య!

తనపై చోరీ నింద వేశారని మనసులో పెట్టుకున్న ఓ 16 ఏళ్ల బాలుడు.. 58 ఏళ్ల మహిళపై దారుణంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లో ఇది వెలుగుచూసింది.

Published : 05 Feb 2023 23:50 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని రేవా(Rewa) జిల్లాలో దారుణం వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం నాటి ఓ చోరీ ఘటనను మనసులో పెట్టుకున్న 16 ఏళ్ల బాలుడు.. అందుకు ప్రతీకారంగా 58 ఏళ్ల మహిళపై దాడి చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై కొడవలితో నరికి హత్యచేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి ఓ గ్రామంలో బాధితురాలి కుటుంబం నివసించేది. పొరుగింట్లో నిందితుడు ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి.. లోపలికి ప్రవేశించాడు. మంచంపై నిద్రపోతున్న ఆమెపై దాడి చేశాడు. ఆమె కేకలు వేసేందుకు యత్నించగా.. నోట్లో పాలిథిన్ కవర్లు, గుడ్డలు కుక్కాడు. తాడుతో ఆమె ముఖంపై ప్లాస్టిక్ సంచి కట్టేశాడు. అనంతరం భవనంలో నిర్మాణంలో ఉన్న భాగానికి ఈడ్చుకెళ్లాడు.

అక్కడ ఆమెను ఓ డోర్‌కు కట్టేసి.. మళ్లీ దాడి చేశాడు. ఊపిరాడక స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై కొడవలితో నరికి చంపేశాడు. అనంతరం ఆమె ఇంట్లో రూ.వెయ్యి నగదు, నగలు తీసుకుని పరారయ్యాడు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పొరుగింట్లో నివసించే బాలుడిపై అనుమానం రావడంతో.. అతన్ని పట్టుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. అతను రెండేళ్ల క్రితం టీవీ చూసేందుకు తమ ఇంటికి తరచూ వచ్చేవాడని, ఓసారి మొబైల్ ఫోన్ చోరీ చేశాడని మహిళ కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలను అవమానంగా భావించిన బాలుడు.. ప్రతీకారంగా ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని