Viral news: దురదృష్టం అంటే ఇదేనేమో.. కూర్చున్న చోటే మృత్యుపీఠమైంది!

రైలులో విండో సీట్‌లో కూర్చున్న ఓ వ్యక్తి మెడలోకి ఇనుప చువ్వ చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దిల్లీలోని ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Published : 02 Dec 2022 18:19 IST

దిల్లీ: మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే నిదర్శనం. అప్పటి వరకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన వ్యక్తి అప్పుడే రైలెక్కాడు. గాలి చక్కగా తగులుతుందనేమో..విండో సీట్‌లో కూర్చున్నాడు. అదే అతడి పాలిట మృత్యుపీఠమైంది. రైలు వేగంగా వెళ్తుండగా.. అనుకోకుండా ఓ ఇనుప చువ్వ కిటికీ అద్దాలను పగులగొట్టుకుంటూ వ్యక్తి మెడలో చొచ్చుకుపోయింది. ఏమైందో అక్కడున్న వారికి తెలిసేలోగానే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన దిల్లీలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.

హరికేశ్‌ దుబే అనే వ్యక్తి ఇవాళ ఉదయం దిల్లీ నుంచి కాన్పూర్‌ వెళ్లే నిలనాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ పరిధిలోని దన్వర్‌-సోమ్నా స్టేషన్ల మధ్యలో ఒక ఇనుప చువ్వ హఠాత్తుగా బోగీలోకి దూసుకొచ్చి.. హరికేశ్‌ మెడలోకి చొచ్చుకుపోయింది. క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అలిగఢ్‌ జంక్షన్‌లో రైలును ఆపి.. మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న భారతీయ రైల్వే వెల్లడించింది. కొన్ని చోట్ల ట్రాక్‌ను సరిచేసేందుకు ఉపయోగించే ఇనుపకడ్డీ బోగీలోకి దూసుకొచ్చిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని