Andhra news: సెల్‌ఫోన్ల కంటైనర్‌ మాయం చేసిన ఘరానా దొంగలు అరెస్ట్‌

హర్యానా నుంచి చెన్నైకి సెల్‌ఫోన్లు తరలిస్తున్న కంటైనర్‌ నుంచి రూ.1.68 కోట్ల విలువ చేసే మొబైల్‌ ఫోన్లు ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు వెల్లడించారు.

Published : 08 Nov 2022 17:28 IST

కడప: హరియాణా నుంచి చెన్నైకి సెల్‌ఫోన్లు తరలిస్తున్న కంటైనర్‌ నుంచి రూ.1.68 కోట్ల విలువ చేసే మొబైల్‌ ఫోన్లు ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 23న కడప శివారులో చెన్నైకి వెళ్తున్న కంటైనర్‌ను నిలిపి అందులో ఉన్న మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఇద్దరు కంటైనర్ల డ్రైవర్ల సాయంతో దొంగలు అపహరించారు. దీనిపై గత నెల 30న కడప చిన్నచౌక్‌ పోలీసులకు బ్లూడాట్‌ కొరియర్‌ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్టు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. కర్ణాటకకు చెందిన మన్సూర్‌ అహ్మద్‌, రెహమాన్‌ షరీఫ్ అనే ఇద్దరు ఘరానా దొంగలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్టు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.68 కోట్ల విలువ చేసే మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీకి పాల్పడిన మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని