
పోలీసుల అదుపులో కూకట్పల్లి దోపిడీ దొంగలు?
హైదరాబాద్ (మూసాపేట): హైదరాబాద్ కూకట్పల్లిలో ఏటీఎం సిబ్బందిపై కాల్పుల జరిపి నగదు దోచుకెళ్లిన ఘటనలో దోపిడీ దొంగలను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దోపిడీ అనంతరం సంగారెడ్డి మీదుగా నాందేడ్ పారిపోతుండగా సంగారెడ్డిలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ద్రువీకరించాల్సి ఉంది. పటేల్కుంట పార్కు సమీపంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సిబ్బంది వెళ్లిన సమయంలో యంత్రంలో డబ్బులు నింపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆల్విన్ కాలనీ వైపు నుంచి పల్సర్ వాహనంపై బ్యాంకు వద్దకు వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అక్కడున్న ఇద్దరు ఏటీఎం సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డుపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం వారి వద్ద ఉన్న రూ.5లక్షల డబ్బును దోచుకెళ్లారు.
ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం..
దుండగుల కాల్పుల్లో ఏటీఎం సిబ్బంది అలీ బేగ్, శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు గాయపడిన వారిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అలీ బేగ్ మృతి చెందగా .. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికంగా దొరికిన ఆధారాలతో పాటు సీసీ కెమేరాల పుటేజీ ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. వేలిముద్రల నిపుణుల సాయంతో వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సొమ్ము దోచుకున్న అనంతరం దుండగులు భాగ్యనగర్ వైపు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.